Breaking: ఆంధ్రప్రదేశ్ జిల్లాల రూపు రేఖలు మారబోతున్నాయి. ప్రస్తుతం 13 జిల్లాలు ఉండగా అవి 26 జిల్లాలు అవ్వబోతున్నాయి. కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియను ప్రభుత్వం ప్రారంభించింది. రేపు లేదా ఎల్లుండి నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు సమాచారం అందుతోంది. ఈ మేరకు దీనికి సంబంధించిన కసరత్తు అంతా పూర్తి అయినట్లు తెలుస్తోంది. ఈ రోజు ఢిల్లీకి వెళ్లిన వైసీపీ పార్లమెంట్ సభ్యులకు కేంద్రం దీనిపై క్లారిటీ ఇచ్చినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి జిల్లాల పునర్విభజనపై పూర్తి నివేదికలు తెప్పించుకున్న తర్వాతే ప్రక్రియ ప్రారంభమైనట్లు తెలుస్తోంది. ఇటీవల జరిగిన వైసీపీ ఎల్పీ సమవేశంలో ఈ అంశంపై సీఎం వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు చేసినట్లు సమాచారం.
Breaking: కేంద్రం గ్రీన్ సిగ్నల్
జిల్లాల పునర్విభజన జరిగితే కేంద్రం నుండి నిధులు వస్తాయన్న చర్చ జరుగుతోంది. ఈ కారణంగా ప్రభుత్వం దీనిపై వేగంగా అడుగులు వేసినట్లు తెలుస్తోంది. ఇటీవల సీఎం వైఎస్ జగన్ ఢిల్లీ పర్యటనలో దీనికి ఆమోదముద్ర వేయించుకున్నారనీ, కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ప్రక్రియను ప్రారంభించారుట. ఈ ప్రక్రియ గతంలోనే పూర్తి కావాల్సి ఉండగా కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో జనగణన పూర్తి అయ్యే వరకూ దేశంలోని ఏ రాష్ట్రంలోనూ భౌగోళిక హద్దులను మార్చడానికి వీలులేదని కేంద్ర ప్రభుత్వం గతంలో స్పష్టం చేసింది. ఆ మేరకు భారత రిజిస్ట్రార్ కార్యాలయం ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఏపిలో జిల్లాల పునర్విభజన ప్రక్రియ తాత్కాలికంగా నిలిచిపోయింది. ఇప్పుడు పరిస్థితులు అన్ని అనుకూలించడంతో నోటిఫికేషన్ జారీకి ప్రభుత్వం సర్వం సిద్ధం చేస్తోందని సమాచారం.
రెండు జిల్లాలుగా అరకు పార్లమెంట్
రాష్ట్రంలోని ప్రతి లోక్ సభ నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా విభజించాలని ప్రభుత్వం ఆలోచన చేసింది. ఆ క్రమంలోనే ప్రభుత్వం గతంలో సీఎస్ నేతృత్వంలో జిల్లాల పునర్విభజన ప్రక్రియకు ఓ కమిటీని వేసింది. రాష్ట్ర కమిటీకి తోడు సబ్ కమిటీలు, డిస్ట్రిక్ట్ లెవల్ కమిటీలను కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ కమిటీలు అధ్యయనం జరిపింది. ఈ కమిటీ రాష్ట్రంలో ఉన్న జిల్లాల సంఖ్య, ఇతర ప్రాంతాల నుండి జిల్లా కేంద్రాలకు దూరం, ఇతర కీలక అంశాలను దృష్టిలో ఉంచుకుని ప్రణాళికలు సిద్దం చేసింది. రాష్ట్రంలో పార్లమెంట్ నియోజకవర్గాల ప్రాతిపదికన చూసుకున్నట్లయితే 25 జిల్లాలు కానుండగా అరకు పార్లమెంట్ విస్తీర్ణం పెద్దది కావడంతో దానిని రెండు జిల్లాలుగా విభజించి మొత్తం 26 జిల్లాలను ఏర్పాటు చేసేందుకు కమిటీ తుది రూపు ఇచ్చినట్లు సమాచారం.