టీడీపీ మాజీ ఎమ్మెల్సీ మారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి అలియాస్ బీటెక్ రవి అజ్ఞాతంలోకి వెళ్లినట్లు సమాచారం. వైఎస్ఆర్ జిల్లా చక్రాయపేటలో భూవివాదానికి సంబంధించి బీటెక్ రవితో పాటు మరో 30 మందిపై రెండు రోజుల క్రితం సోమవారం కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. చక్రాయపేట మండలం సురభి గ్రామం నాగలగుట్టపల్లె సినిమా హాలు సమీపంలో కొందరు వ్యాపారులు వేసిన రియల్ ఎస్టేట్ వెంచర్ లోకి ప్రవేశించి ధ్వంసం చేశారనే అభియోగంపై కేసు నమోదు అయ్యింది. ఈ క్రమంలో ఇప్పటికే పలువురుని అరెస్టు చేశారు. మరో పక్క తమ నేతలపై అక్రమంగా కేసులు నమోదు చేశారంటూ టీడీపీ నేతలు పేర్కొంటున్నారు.
ఈ కేసులో బీటెక్ రవిని పోలీసులు అరెస్టు చేసే అవకాశం ఉండటంతో ఆయన అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. బీటెక్ రవి తప్పుడు పేరుతో స్పెషల్ ఫ్లైట్ లో హైదరాబాద్ నుండి చెన్నై పరారైయ్యాడని వైసీపీ శ్రేణులు ఆరోపిస్తున్నారు. ఆయన పేరు మారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి అయితే ఎం రవీందర్ పేరుతో బీజేపీ ఎంపీ సీఎం రమేష్ తో కలిసి హైదరాబాద్ నుండి ప్రత్యేక విమానంలో వెళ్లినట్లుగా ప్రచారం జరుగుతోంది. దీనికి సంబంధించి ఫైట్ ప్యాసింజర్ మానిఫెస్ట్ ను సోషల్ మీడియాలో వైరల్ చేశారు. భూవివాదానికి సంబంధించి పాత తేదీలతో ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించాలని టీడీపీ నేతలు ప్రయత్నిస్తున్నారని వెంచర్ యజమానులు ఆరోపిస్తున్నారు. ఆయన (బీటెక్ రవి)కు ధైర్యం ఉంటే వెంచర్ ఒరిజినల్ డాక్యుమెంట్లు తీసుకువచ్చి నిజాయితీని నిరూపించుకోవాలని వారు సవాల్ విసురుతున్నారు.
చంద్రబాబు అరెస్టు ఖాయమే(నట)..!