Budget 2021 : ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ 2021 కేంద్ర బడ్జెట్ ను పార్లమెంట్ లో ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. వైద్య ఆరోగ్యశాఖకు అధిక ప్రాధాన్యత ఇస్తూ మరో అయిదు ప్రాధామ్యాలతో బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. ప్రధాన మంత్రి మోడీ అధ్యక్షతన తొలుత జరిగిన కేంద్ర కేబినెట్ భేటీలో 2021-22 బడ్జెట్ను ఆమోదించారు. అనంతరం పార్లమెంట్ లో విపక్షాల నిరసన మధ్య మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ను చదివి వినిపించారు.
అయితే బడ్జెట్ కేటాయింపులపై ఏపిలోని అధికార ప్రతిపక్షాలు పెదవి విరుస్తున్నారు. అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ బడ్జెట్ పై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాయి. కేంద్ర బడ్జెట్ చాలా నిరాశాజకంగా ఉందని అన్నారు వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి. ఏపిపై సవతితల్లి ప్రేమ చూపారని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో వచ్చిన బడ్జెట్ ల కంటే చాలా చెత్తగా ఉందని అభివర్ణించారు. అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తమిళనాడు, పశ్చిమ బెంగాల్, అసోం, పుదుచ్ఛేరి, కేరళ రాష్ట్రాలకు బడ్జెట్ కేటాయింపులు ఉంటాయని అందరూ ఊహించారు. అందరి ఊహలకు అనుగుణంగానే మంత్రి నిర్మలా సీతారామన్ ప్రసంగంలో ఈ రాష్ట్రాలకు భారీగానే కేటాయింపులు జరిగాయి.
తమిళనాడు రాష్ట్రంలో దాదాపు 3500 కిలో మీటర్ల మేర రహదారుల నిర్మాణానికి ఏకంగా లక్ష కోట్ల రూపాయలు కేటాయించారు. మధురై – కొల్లమ్ కారిడార్, చిత్తూరు – తుత్పురు కారిడార్ ప్రాంతాల్లో ఈ రహదారుల నిర్మాణం జరగనున్నది. కేరళకు భారీగానే కేటాయింపులు జరిగాయి. దాదాపు 1100 కిలో మీటర్ల జాతీయ రహదారి నిర్మాణం కోసం 65వేల కోట్ల రూపాయలను కేటాయించారు. అదే విధంగా పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో 6700 కిలో మీటర్ల మేర రహదారుల నిర్మాణానికి 25వేల కోట్ల రూపాయలను కేటాయించారు. అసోం రాష్ట్రంలో రహదారుల నిర్మాణంకు రూ.19వేల కోట్లు కేటాయించింది కేంద్రం. వీటిని దృష్టిలో పెట్టుకుని విజయసాయి రెడ్డి మాట్లాడుతూ ఇది ఎన్నికలు ఉన్న రాష్ట్రాల బడ్జెట్ లా ఉందని అన్నారు.
కేంద్రం తెలుగు రాష్ట్రాలకు మొండి చేయి చూపించిందని విమర్శించారు ఏపిసిసి అధ్యక్షుడు శైలజానాధ్. కేంద్ర బడ్జెట్ పేదలకు షాక్ ఇచ్చిందన్నారు. పెట్రోల్, డీజిల్ దరలు పెంచడం వల్ల రవాణాస, నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోతాయని ఆయన అన్నారు. టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు మాట్లాడుతూ కేంద్ర బడ్జెట్ లో ఏపిని విస్మరించడం బాధాకరమని అన్నారు. దక్షిణాది రాష్ట్రాల గురించి ప్రస్తావించిన కేంద్రం..తెలుగు రాష్ట్రాలను విస్మరించిందన్నారు.
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తమిళుల ఆడపడుచు. తెలుగింటి కోడలు అన్న సంగతి అందరికీ తెలిసిందే. దీన్ని దృష్టిలో పెట్టుకుని కోడలు కోడలే..కోడలు కూతురు కాలేదుగా అని అంటున్నారు.