Bus Accident: నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలంలో ఓ ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా మరో 34 మంది గాయపడ్డారు. ఆత్మకూరు నుండి నెల్లూరు వైపు వెళుతున్న పల్లె వెలుగు బస్సు దామరమడుగు మఠం కాలనీ సమీపంలో ఆగి ఉన్న లారీని వెనుక వైపు నుండి ఢీకొట్టింది. ఆ తరువాత బస్సు అదుపుతప్పి రోడ్డుపై నుండి 15 అడుగుల లోతులో ఉన్న పంట పొలాల్లోకి బోల్తా కొట్టింది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. క్షతగాత్రులను 108 అంబులెన్స్ లో నెల్లూరులోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రుల్లో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. డ్రైవర్ నిర్లక్ష్యం వల్లనే ఈ ప్రమాదం జరిగిందని ప్రయాణీకులు పేర్కొంటున్నారు. బస్సు ప్రమాదానికి గురి కావడంతో పెద్ద సంఖ్యలో స్థానికులు అక్కడకు చేరుకుని క్షతగాత్రులను బస్సు నుండి బయటకు తీయడంతో సహాయ సహకారాలు అందించారు.