Byreddy Rajasekhar Reddy: ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ పార్టీల నేతలు వాడుతున్న భాషాపదజాలంపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం అవుతున్న సంగతి తెలిసిందే. గతంలో మంత్రి కొడాలి నాని వరకే పరిమితమైన ఆ భాషా సంస్కృతిని ఇప్పుడు చాలా మంది నాయకులు అందిపుచ్చుకున్నారు. వైసీపీ నేతలకే కాదు మాకు తిట్లు వచ్చు అన్నట్లుగా టీడీపీ నేతలు ఆ రీతిలోనే పద ప్రయోగం చేస్తున్నారు. ఇటీవల టీడీపీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ (పట్టాభి) చేసిన పదప్రయోగం బోస్డీకే తీవ్ర దుమారాన్ని రేపిన సంగతి తెలిసిందే. దాదాపు వారం రోజుల పాటు దీనిపైనే వైసీపీ, టీడీపీ మధ్య మాటల యుద్ధం నడిచింది. ప్రస్తుతం రాష్ట్రంలో రాజకీయ నాయకుల సరళిపై రాయలసీమ ప్రాంతానికి చెందిన బీజేపీ నేత బైరెడ్డి రాజశేఖరరెడ్డి స్పందించారు. మంత్రులు ఎమ్మెల్యేలు మాట్లాడుతున్న భాషపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
Byreddy Rajasekhar Reddy: నేతల తిక్కతిక్క మాటలు ఆపాలి
కొంత మంది తిక్కతిక్క మాటలు మాట్లాడుతున్నారు. ఆయన ఎవరో మంత్రి కొడాలి నాని మాట్లాడే మాటలు ఎంత అవమానకరంగా ఉంటున్నాయి, ఆ మాటలు మనం వినగలమా అని వ్యాఖ్యానించారు. దానికి తోడు తెలుగుదేశం కూడా తక్కువ లేదు, వారు కూడా అభ్యంతరకర రీతిలో మాట్లాడుతున్నారని బైరెడ్డి అన్నారు. ఇటీవల రాయలసీమ ప్రాంతానికి చెంది ఓ టీడీపీ ఎమ్మెల్యే సీమ ప్రాంతంలో ఉపయోగించే అన్ని తిట్లు ప్రయోగించాడని అన్నారు. అసెంబ్లీలో అర్ధవంతమైన చర్చ ఏమైనా జరుగుతుందా అని ప్రశ్నించారు. అసెంబ్లీలో ఎన్ని సమస్యలు తీసుకురావాలి. అలా చేస్తున్నారా ? అసెంబ్లీలో చర్చల నుండి బహిరంగ సమావేశాల వరకూ ఎక్కడా రాజకీయ నేతల మాటల్లో హుందాతనం కనిపించడం లేదని బైరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.
పిల్లల భవిష్యత్తు కోసం నేతలు నోరు అదుపులో పెట్టుకోవాలి
కొడాలి నానితో తనకు పరిచయం అయితే లేదు కానీ నోరు అదుపులో పెట్టుకోవాలని సూచిస్తున్నానన్నారు. ఆయనతో పాటు ఇతర పార్టీల నాయకులు అందరూ కూడా వారు వాడే భాష విషయంలో నోరు అదుపులో పెట్టుకోవాలని కోరారు. దీని వల్ల పిల్లలు చెడిపోతారని ఆవేదన వ్యక్తం చేశారు. బోస్ డికే అనే లాంటి మాటలు మాట్లాడటం వల్ల ఎంత మంది మీద ప్రభావం పడుతుందో నేతలు తెలుసుకోవాలన్నారు. “మీ తిట్లు చూసి పిల్లలు చెడిపోతార్రా నాయనా , ఒకాయన వచ్చి బోషడీకే అంటాడు… మరొకాయన వచ్చి బోషడికే అంటే అర్ధం ఇదీ అని వివరిస్తాడు. ఈయనేమన్నా తిట్లలో పండితుడా, తెలంగాణ భాష కానీ, రాయలసీమ భాష కానీ, కోస్తాంధ్ర భాష కానీ ఎంతో చక్కని భాషలు, కానీ కొత్త కొత్త భాషావేత్తలు పుట్టుకొస్తున్నారు, ఇది చాలా దురదృష్టకరం” అని బైరెడ్డి అన్నారు.