Nara Lokesh: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సహా 33 మంది పార్టీ నేతలపై పాత గుంటూరు పోలీస్ స్టేషన్ లో వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. గుంటూరులో దారుణ హత్యకు గురైన బీటెక్ విద్యార్థిని రమ్య కుటుంబ సభ్యులను పరామర్శించి, ఆమె భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించేందుకు సోమవారం లోకేష్ వెళ్లారు. ఇదే సమయంలో వైసీపీ నేతలు కూడా అక్కడకు చేరుకోవడంతో ఉద్రిక్తత నెలకొన్నది. పోలీసులు టీడీపీ నేతలను బలవంతంగా అక్కడి నుండి తరలించారు. లోకేష్ ను అదుపులోకి తీసుకుని ప్రత్తిపాడు పోలీస్ స్టేషన్ కు తరలించారు. సాయంత్రం 151 సీఆర్పీసీ చట్టం కింద నోటీసులు జారీ చేసి వదిలిపెట్టారు.
ఈ ఘటనను పురస్కరించుకుని పాత గుంటూరు పోలీస్ స్టేషన్ నందు నారా లోకేష్ సహా మొత్తం 33 మంది టీడీపీ నేతపై కేసు నమోదు చేశారు. కోవిడ్ నిబంధనలు ఉల్లంఘనతో పాటు పోలీసు విధులకు ఆటంకం కల్గించారన్న అభియోగాలతో ఐపీసీ 341, 353, 147 రెడ్ విత్, 149 రెడ్ విత్, 120 బీ సెక్షన్ ల కింద కేసు నమోదు చేశారు. ప్రత్తిపాటి పుల్లారావు, ఆలపాటి రాజా, నక్కా ఆనంద్ బాబు, ధూళిపాళ్ళ నరేంద్ర, తెనాలి శ్రావణ్ కుమార్, అనిత తదితరులపై కేసు నమోదు చేశారు. కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించారని నక్కా ఆనంద్ బాబు, ధూళిపాళ నరేంద్రతో పాటు మరో పది మంది నేతలపై కొత్తపేట పీఎస్ లో పోలీసులు కేసు నమోదు చేశారు.