TTD Board: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పాలకమండలిలో ప్రత్యేక ఆహ్వానితుల నియామకానికి సంబంధించి ప్రభుత్వం జారీ చేసిన జివోను ఏపి హైకోర్టు సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ వివాదంకు సంబంధించి నేడు సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు అయ్యింది. టీటీడీ పాలకమండలిలో ప్రత్యేక ఆహ్వానితుల నియామకం వ్యవహారంపై సుప్రీం కోర్టులో పిటిషనర్ మాదినేని ఉమామహేశ్వరరావు తరపున న్యాయావాది బాలాజీ కెవియట్ దాఖలు చేశారు.
టీటీడీ పాలకమండలిలో పెద్ద సంఖ్యలో ప్రత్యేక ఆహ్వానితులను నియమించడంపై ఇటీవల ఏపి హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆ ఉత్తర్వులను సస్పెండ్ చేసింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకూ ఆ జివోను సస్పెండ్ చేస్తూ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అరూప్ కుమార్ గోస్వామి నేతృత్వంలోని ధర్మాసనం ఆదేశాలు ఇచ్చింది. అయితే హైకోర్టు తీర్పును ఏపి ప్రభుత్వం సుప్రీం కోర్టులో సవాల్ చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో ఏపి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన మాదినేని సుప్రీంలో కెవియట్ దాఖలు చేస్తూ..హైకోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు అయితే తమ వాదనలు విన్న తరువాతే నిర్ణయం తీసుకోవాలని సుప్రీం కోర్టులో కెవియట్ దాఖలు చేశారు.