Breaking: అరకు మాజీ ఎంపీ కొత్తపల్లి గీతకు సీబీఐ కోర్టు అయిదేళ్ల జైలు శిక్ష, లక్ష రూపాయల జరిమానా విధించింది. పంజాబ్ నేషనల్ బ్యాంకు నుండి విశ్వేశ్వర ఇన్ ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ పేరుతో రుణం తీసుకుని ఎగ్గొట్టారనే బ్యాంకు అధికారుల ఫిర్యాదుతో కొత్తపల్లి గీతపై గతంలోనే కేసులు నమోదు అయ్యాయి. తాజాగా ఈ రుణాల పేరుతో బ్యాంకును మోసం చేసిన కేసులో ఈ శిక్ష ఖరారు అయ్యింది. ఇదే కేసులో గీతతో పాటు ఆమె భర్త పి రామకోటేశ్వరరావుకు అయిదేళ్లు శిక్ష, లక్ష రూపాయల జరిమానా విధించారు. మాజీ ఎంపీ గీతకు సహకరించిన బ్యాంకు అధికారులు బీకే జయప్రకాషన్, కేకే అరవిందాక్షన్ కు జైలు శిక్ష పడింది. విశ్వేశ్వర ఇన్ ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ కు సీబీఐ కోర్టు రూ.2లక్షల జరిమానా విధించింది. ఈ నేపథ్యంలో గీతతో సహా ఇతర నిందితులను సీబీఐ అధికారులు అరెస్టు చేసి చంచల్ గూడ జైలుకు తరలించారు. మరో వైపు తెలంగాణ హైకోర్టులో ఆమె తరపు న్యాయవాదులు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు.
కొత్తపల్లి గీత 2014 ఎన్నికల్లో వైసీపీ తరపున అరకు పార్లమెంట్ కు పోటీ చేసి ఎంపీగా గెలిచారు. తర్వాత 2018లో వైసీపీని వీడి టీడీపీలో చేరారు. ఆ తర్వత జనజాగృతి పేరిట రాజకీయ పార్టీ నెలకొల్పారు. అనంతరం ఆమె బీజేపీలో చేరి తన పార్టీని కూడా అందులో విలీనం చేశారు. కొత్తపల్లి గీత రాజకీయాల్లోకి రాకముందు గ్రూపు అధికారి (డిప్యూటి కలెక్టర్) గా పని చేశారు.