CBI Court: వైసీపీ రెబల్ ఎంపి రఘురామ కృష్ణం రాజుకు సీబీఐ కోర్టులోనూ గట్టి షాక్ తగిలింది. అక్రమాస్తుల కేసులో జగన్ బెయిల్ రద్దు చేయాలని కోరుతూ రఘురామ కృష్ణంరాజు సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్ పై ఇరుపక్షాల వాదనలు పూర్తి అయిన నేపథ్యంలో సీబీఐ కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. నేడు సీబీఐ కోర్టు తీర్పు వెలవరించనుండగా రఘురామ నిన్న తెలంగాణ హైకోర్టు ఆశ్రయించారు. సీబీఐ కోర్టు తీర్పు వెలవరించకుండా ఆ కేసును వేరే కోర్టుకు బదిలీ చేయాలని కోరుతూ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు నేడు రఘురామ అభ్యర్థనను తోసి పుచ్చింది. హైకోర్టు నుండి ఎటువంటి అడ్డంకి లేకపోవడంతో సీబీఐ కోర్టు కొద్ది సేపటి క్రితం జగన్ బెయిల్ రద్దు పిటిషన్ పై తీర్పు వెల్లడించింది. రఘురామ కృష్ణం రాజు, విజయసాయిరెడ్డి పై రఘురామ వేసిన పిటిషన్ ను కోర్టు డిస్మిస్ చేసింది.
రఘురామ కృష్ణంరాజు సీబీఐ కోర్టులో పిటిషన్ వేసింది మొదలు రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీతో పాటు ఆ పార్టీ అనుకూల మీడియా జగన్ బెయిల్ రద్దు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనీ, జైలుకు వెళ్లడం ఖాయమంటూ విస్తృతంగా ప్రచారాన్ని తెరపైకి తీసుకువచ్చారు. పలు ఛానల్స్ దీనిపై డిబేట్లు నిర్వహించాయి. కాగా సీబీఐ కోర్టు రఘురామ పిటిషన్ ను కొట్టివేయడంతో జగన్ కు బిగ్ రిలీఫ్ వచ్చినట్లు అయ్యింది.
కాగా ఈ అంశంపై రఘురామ కృష్ణంరాజు సీబీఐ కోర్టు తీర్పు రాకముందు సెల్ఫీ వీడియో విడుదల చేశారు. ఈ వ్యవహారం ఇక్కడితో ఆగదనీ, సీబీఐ కోర్టు తీర్పు ఎవరికి వ్యతిరేకంగా వస్తే వారు హైకోర్టుకు వెళ్లడం జరుగుతుందన్నారు. తనకు వ్యతిరేకంగా తీర్పు వస్తే హైకోర్టులో రివ్యూ పిటిషన్ వేస్తామన్నారు. హైకోర్టు తీర్పు తరువాత ఇది సుప్రీం కోర్టు వరకూ వెళుతుందని వ్యాఖ్యానించారు.