CBI Court: అక్రమాస్తుల కేసులో ఏ పి సీఎం వైఎస్ జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ నర్సాపురం ఎంపి రఘురామ కృష్ణంరాజు దాఖలు చేసిన పిటిషన్ పై సీ బీ ఐ కోర్టులో బుధవారం కీలక పరిణామం చోటుచేసుకుంది. లిఖిత పూర్వకంగా తమ వాదనలు సమర్పించేందుకు సమయం కావాలని సీబీఐ కోరడంతో ఈ పిటిషన్ పై విచారణను కోర్టు మరో సారి వాయిదా వేసింది. ఈ నెల 26కు విచారణను వాయిదా వేస్తూ నాంపల్లిలోని సీబీఐ ప్రత్యేక కోర్టు బుధవారం నిర్ణయం తీసుకున్నది.
Read More: AP Capital: ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంపై కేంద్రం ఇచ్చిన తాజా క్లారిటీ ఇదీ..!!
ఇంతకు ముందు విచారణలకు మాదిరిగా కాకుండా బుధవారం నాటి విచారణలో పలు కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఈ పిటిషన్ పై ఇప్పటికే జగన్ తన కౌంటర్ దాఖలు చేయగా, దానిపై పిటిషనర్ రఘురామ కృష్ణంరాజు తన సమాధానాన్ని కోర్టుకు తెలిపారు. అయితే ఈ పిటిషన్ పై కీలకమైన సీబీఐ మాత్రం ఇప్పటి వరకూ తన కౌంటర్ దాఖలు చేయలేదు. బెయిల్ రద్దు విషయంలో తొలుత నిర్ణయాధికారాన్ని కోర్టుకు వదిలివేసిన సీబీఐ.. లిఖిత పూర్వకంగా వాదనలు తెలియజేసేందుకు సమ్మతించలేదు.
అయితే బుధవారం నాటి విచారణ సందర్భంగా తన వాదనలను లిఖితపూర్వకంగా సమర్పించేందుకు సమ్మతిస్తూ పది రోజులు గడువును కావాలని సీబీఐ కోరింది. సీబీఐ వైఖరిపై రఘురామ తరపు న్యాయవాది అభ్యంతరం వ్యక్తం చేశారు. సీబీఐ తరచూ వైఖరి మారుస్తూ కాలయాపన చేస్తోందని ఆరోపించారు. అనంతరం సీబీఐ వాదనలను పరిగణలోకి తీసుకున్న కోర్టు తదుపరి విచారణను ఈ నెల 26వ తేదీకి వాయిదా వేసింది.