Viveka Murder Case: మాజీ మంత్రి వివేకా హత్య కేసులో సీబీఐ విచారణ 72వ రోజ కొనసాగుతోంది. పులివెందుల ఆర్ అండ్ బీ అతిధి గృహంలో అనుమానితులను సీబీఐ విచారిస్తోంది. ఇటీవల వరకూ సీబీఐ చిన్న స్థాయి వ్యక్తులను మాత్రమే విచారణ చేస్తుండటంతో కేసు పక్కదారి పడుతోందని అనుకున్నారు. వివేకా కుమార్తె డాక్టర్ సునీత ఇచ్చిన అనుమానితుల జాబితాలోని ప్రముఖులను సీబీఐ విచారణ చేయకపోవడంపై సర్వత్రా అనుమానాలు వ్యక్తం అయ్యాయి. అయితే ఈ కేసులో సీబీఐ దర్యాప్తు కీలక దశకు చేరుకున్న నేపథ్యంలో వైసీపీ కార్యకర్త సునీల్ కుమార్ యాదవ్ ను అరెస్టు చేసిన తరువాత అతన్ని విచారించగా కీలక సమాచారం సేకరించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే దివంగత సీఎం వైఎస్అర్ బంధువులను సీబీఐ అధికారులు విచారణ చేస్తున్నారు. సీబీఐ కీలక అనుమానితులను విచారిస్తుండటం ప్రాధాన్యతను సంతరించుకున్నది.
సీబీఐ అధికారుల విచారణలో భాగంగా కడప ఎంపి అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డిని అధికారులు మంగళవారం ప్రశ్నిస్తున్నారు. వివేకా హత్య కేసులో బాస్కరరెడ్డి కీలక అనుమానితుడిగా ఉన్నారు. ఇదే సమయంలో కడప సెంట్రల్ జైలు గెస్ట్ హౌస్ లో సీబీఐ అధికారులు మరో బృందంగా జగదీశ్వరరెడ్డి, భరత్ కుమార్ లను విచారిస్తున్నారు. వీరిలో జగదీశ్వరరెడ్డి వైఎస్ వివేకా పొలం పనులు చూసేవారు కాగా, భరత్ కుమార్ సీబీఐ అరెస్టు చేసిన సునీల్ కుమార్ యాదవ్ బందువు. ఇంతకు ముందే సీబీఐ ఎంపి అవినాష్ రెడ్డి పీఎలను పిలిపించి విచారణ చేశారు. కాగా సునీల్ కుమార్ యాదవ్ కు నార్కో పరీక్షలు నిర్వహించేందుకు సీబీఐ కోర్టును కోరింది.