CBI; ఏపి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) ఆదిత్యనాథ్ దాస్ కు మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబి వెంకటేశ్వరరావు లేఖ రాశారు. తనపై నమోదు అయిన కేసులో ఫోర్జరీ పత్రాలను సృష్టించిన వారిపై కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐతో విచారణ చేయించాలని కోరారు. తనపై ఎంక్వయిరీస్ కమిషనర్ జరిపిన విచారణ సందర్భంగా దొంగ డాక్యుమెంట్లను సమర్పించారని ఏబీ వెంకటేశ్వరరావు గతంలోనే ఆరోపించారు. నకిలీ డాక్యుమెంట్ లకు సంబంధించి పలు ఆధారాలను సీఎస్ కు రాసిన లేఖతో జత చేసిన ఏబీ వెంకటేశ్వరరావు వీటిని పరిశీలించి సీబీఐ దర్యాప్తు చేయించాలని కోరారు. సీబీఐ విచారణకు ప్రభుత్వం అంగీకరించకపోతే కోర్టుకు వెళ్లే ఆలోచనలో ఏబివీ ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ కేసు సుప్రీం కోర్టులో విచారణ జరుగుతోంది.
గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఏబీ వెంకటేశ్వరరావు ఇంటెలిజెన్స్ చీఫ్ బాధ్యతలు నిర్వహించారు. అయితే వైఎస్ జగన్మోహనరెడ్డి ముఖ్య మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత చంద్రబాబు హయాంలో రక్షణ సామాగ్రి కొనుగోళ్లలో అవకతవకలు, అక్రమాలకు పాల్పడ్డారన్న అభియోగంతో ప్రభుత్వం ఆయనను సస్పెండ్ చేసింది. దీనిపై ఏబీవీ క్యాట్ ను ఆశ్రయించగా ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్ధించింది. ఆ తరువాత ఏబీవీ ఏపి హైకోర్టును ఆశ్రయించగా సస్పెన్షన్ ఉత్తర్వులను రద్దు చేసి ఆయనను విధుల్లోకి తీసుకోవాలని ఆదేశించింది. అయితే ప్రభుత్వం హైకోర్టు ఉత్తర్వులను సుప్రీం కోర్టులో సవాల్ చేసింది. ప్రస్తుతం ఈ కేసు సుప్రీం విచారణలో ఉంది. ఈ నేపథ్యంలోనే ఏబీవీ విజ్ఞప్తి మేరకు ఇటీవల ఎంక్వయిరీస్ కమిషనర్ విచారణ జరిపింది.