YS Viveka Murder Case: మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సీబీఐ సిట్ దర్యాప్తు వేగాన్ని పెంచింది. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు ఈ నెలాఖరుకు విచారణ ముగించే దిశగా సీబీఐ అడుగులు వేస్తొంది. ఈ క్రమంలో ఎంపీ అవినాష్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్కరరెడ్డిని ఆదివారం అరెస్టు చేసిన సీబీఐ అధికారులు .. తాజాగా మరో సారి ఎంవి అవినాష్ రెడ్డికి నోటీసులు జారీ చేసింది. వివేకా హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అవినాష్ రెడ్డిని ఇప్పటికే నాలుగు పర్యాయాలు సీబీఐ అధికారులు ప్రశ్నించారు. రేపు మధ్యాహ్నం మూడు గంటలకు విచారణ కు రావాలని అవినాష్ రెడ్డికి సీబీఐ అధికారులు నోటీసులు జారీ చేశారు. హైదరాబాద్ సీబీఐ కార్యాలయంలో అవినాష్ రెడ్డి ని సీబీఐ ప్రశ్నించనున్నది.
గతంలో విచారణలు ఎదుర్కొన్న అవినాష్ రెడ్డి .. సీబీఐ ఆధికారుల దర్యాప్తు తీరుపై ఆరోపణలు చేశారు. వివేకా హత్య కేసులో విషయంలో పలు కీలక అంశాలను ప్రస్తావించి ఆ దిశగా విచారణ చేయాలని కూడా కోరారు. సీబీఐ దర్యాప్తు ముమ్మరం చేసి పలు మార్లు విచారణ జరిపిన నేపథ్యంలో అవినాష్ రెడ్డి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. అయితే సీబీఐ అధికారుల నోటీసులపై స్టే ఇవ్వడానికి హైకోర్టు అనుమతించలేదు. విచారణను ఎదుర్కొవాల్సిందేనని తెలిపింది. అయితే విచారణ పూర్తి అయ్యే వరకూ అరెస్టు చేయవద్దని మాత్రం కోర్టు తెలిపింది. అయితే ఆయన తండ్రి భాస్కరరెడ్డి అరెస్టు అనంతరం అవినాష్ రెడ్డిని సీబీఐ అధికారులు విచారణకు పిలవడంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
కాగా ఇవేళ ఉదయం వైఎస్ అవినాష్ రెడ్డి తండ్రి భాస్కరరెడ్డి సీబీఐ అధికారులు అరెస్టు చేసి న్యాయమూర్తి ముందు హజరుపర్చగా 14 రోజులు రిమాండ్ విధించారు. దీంతో ఆయనను హైదరాబాద్ చంచల్ గూడ జైలుకు తరలించారు. తమకు పది రోజుల కస్టడీ విచారణకు అనుమతి ఇవ్వాలని కోరుతూ సీబీఐ పిటిషన్ దాఖలు చేసింది. ఇంకా ఈ హత్య కేసులో విచారించాల్సిన ఉందని, అందుకు భాస్కరరెడ్డిని తమ కస్టడీకి పది రోజుల పాటు అప్పగించాలని సీబీఐ తమ పిటిషన్ లో కోరింది. ఈ పిటిషన్ పై సోమవారం విచారణ జరగనున్నది.
అంతకు ముందు వైఎస్ భాస్కరరెడ్డిని పులివెందుల నుండి హైదరాబాద్ కు తీసుకువచ్చిన సీబీఐ అధికారులు ముందుగా ఉస్మానియా ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించారు. భాస్కరరెడ్డి కి బీపీ లెవల్స్ పెరగడంతో కొద్ది సేపు వైద్యులు అబ్జర్వేషన్ లో ఉంచారు. మందులు వాడాలని సూచించారు. కొద్దిసేపు అబ్జర్వేషన్ లో ఉంచిన వైద్యులు ఆ తర్వాత ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని తెలియజేయడంతో సీబీఐ అధికారులు ఆయనను తరలించి న్యాయమూర్తి ముందు ప్రవేశపెట్టారు. భాస్కరరెడ్డికి 14 రోజుల రిమాండ్ విధించారు. న్యాయమూర్తి ఆదేశాలతో ఆయనను చంచల్ గూడ జైలుకు తరలించారు. భాస్కరరెడ్డి రిమాండ్ రిపోర్టులో సీబీఐ కీలక అంశాలను ప్రస్తావించింది. పది పేజీల రిమాండ్ రిపోర్టును సీబీఐ కోర్టుకు సమర్పించింది.
వైఎస్ వివేకా హత్య కేసులో భాస్కరరెడ్డి పాత్ర కీలకమని సీబీఐ అభియోగం మోపింది. హత్యకు ముందు, తర్వాత నిందితులు భాస్కరరెడ్డి ఇంట్లో ఉన్నారనీ, దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి, వైఎస్ భాస్కరరెడ్డి కలిసి పథకం ప్రకారమే వివేకాను హత్య చేయించారని రిమాండ్ రిపోర్టులో సీబీఐ ప్రస్తావించింది. సాక్షాలు తారుమారు చేయడంలో కీలక పాత్ర పోషించారని తెలిపింది. విచారణకు భాస్కరరెడ్డి సహకరించడం లేదనీ, ఆయన పారిపోయే అవకాశం ఉందని అరెస్టు చేశామని పేర్కొంది. కీలక సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందనే అరెస్టు చేశామని సీబీఐ తెలిపింది.