CBI: వైసీపీ సానుభూతిపరుడైన ఎన్ఆర్ఐ పంచ్ ప్రభాకర్ కు ఉచ్చు బిగుసుకుంది. ఏపి హైకోర్టు న్యాయమూర్తులపైన, హైకోర్టు తీర్పులపైనా సోషల్ మీడియాలో పోస్టులు, వీడియోలు పోస్టులు చేసిన వ్యవహారంపై ఇటీవల హైకోర్టు సీరియస్ వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. న్యాయమూర్తులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో పంచ్ ప్రభాకర్ అరెస్టునకు హైకోర్టు ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో సీబీఐ నేడు ఇంటర్ పోల్ ద్వారా నోటీసులు జారీ చేసింది. పంచ్ ప్రభాకర్ అరెస్టు కోసం ఇంటర్ పోల్ ద్వారా బ్లూ నోటీసు జారీ చేసినట్లు సీబీఐ కేంద్ర కార్యాలయం నేడు వెల్లడించింది.
CBI: ప్రభాకర్ అరెస్టునకు బ్లూ నోటీసు జారీ చేసిన సీబీఐ
ప్రభాకర్ తో పాటు విదేశాల్లో ఉంటున్న మరో నిందితుడికి కూడా బ్ల్యూ నోటీసు జారీ చేసినట్లు పేర్కొంది. ఈ కేసులో ఇప్పటి వరకు 11 చార్జి షీట్లు దాఖలు చేసిన సీబీఐ విదేశాలలో ఉన్న నిందితుల అరెస్టునకు దౌత్య ఛానెళ్ల ద్వారా ప్రక్రియ ప్రారంభించింది. న్యాయమూర్తులు, న్యాయ వ్యవస్థ కు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో అవమాన కరమైన రీతిలో పోస్టులు పెట్టిన అభియోగంపై నిందితులుగా ఉన్న అవుకు శ్రీధర్ రెడ్డి, జలగం వెంకట సత్యనారాయణ, శ్రీనాధ్ సుస్వరం, దరిస కిషోర్ రెడ్డి, సుద్దులూరి అజయ్ అమృత్ లపై వేరువేరుగా చార్జిషీట్లను సీబీఐ దాఖలు చేసింది.
దూకుడు పెంచిన సీబీఐ
ఏపిలో వైసీపీ ప్రభుత్వం తీసుకున్న పలు కీలక నిర్ణయాలపై హైకోర్టులో ప్రతికూల తీర్పులు రావడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తూ పలువురు వైసీపీ సానుభూతి పరులు హైకోర్టు తీర్పులపై అభ్యంతరకరంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. దీనిపై దాఖలైన పిటిషన్ ను విచారించిన హైకోర్టు దర్యాప్తు చేయాలంటూ తొలుత ఏపి సీఐడీకి ఆదేశాలు ఇచ్చింది. కానీ సీఐడీ దర్యాప్తు సక్రమంగా చేయకపోవడంతో కేసును సీబీఐకి అప్పగించింది. అయితే సీబిఐ కూడా వైసీపీ నేతల పట్ల దూకుడుగా వ్యవహరించకపోవడంతో హైకోర్టు ఇటీవల సీరియస్ వ్యాఖ్యలు చేసింది. సీబీఐ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ పంచ్ ప్రభాకర్ ను పది రోజుల్లో అరెస్టు చేయాలని ఆదేశాలు ఇచ్చింది. దీంతో సీబీఐ దూకుడు పెంచి ఇంటర్ పోల్ నోటీసులు జారీ చేసింది.