రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. వివేకా హత్య కేసులో ప్రధాన నిందితుడు (ఏ 1) ఎర్ర గంగిరెడ్డి బెయిల్ రద్దు చేయాలని కోరుతూ సుప్రీం కోర్టును ఆశ్రయించింది సీబీఐ. ఈ మేరకు సుప్రీం కోర్టులో సీబీఐ పిటిషన్ దాఖలు చేసింది. నిందితుడు గంగిరెడ్డికి గతంలో సెషన్స్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది.
అయితే ప్రధాన నిందితుడు గంగిరెడ్డి బెయిల్ పై బయట ఉండటం వల్ల సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని, అతని బెయిల్ రద్దు చేయాలని సీబీఐ తొలుత ఏపి హైకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్ ను విచారించిన ఏపి హైకోర్టు ఈ ఏడాది మార్చి నెలలో సీబీఐ సరైన సాక్షాలను చూపించలేదని పిటిషన్ ను తోసిపుచ్చింది. దీంతో హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీం కోర్టును సీబీఐ ఆశ్రయించింది. వివేకా హత్య కేసులో సీబీఐ దాఖలు చేసిన చార్జిషీటులోనూ గంగిరెడ్డిని ఏ 1గా చేర్చింది. సీబీఐ దాఖలు చేసిన పిటిషన్ పై త్వరలో సుప్రీం కోర్టులో విచారణ జరగనుంది.