మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ దూకుడు పెంచింది. విచారణ గడువును మరో రెండు నెలలు సుప్రీం కోర్టు పెంచినప్పటికీ నూతనంగా ఏర్పాటైన సీబీఐ సిట్ బందం దర్యాప్తు వేగాన్ని పెంచింది. ఓ వైపు వివేకా కేసులో వైఎస్ భాస్కరరెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డిలను గత ఆరు రోజుల పాటు విచారించిన సీబీఐ అధికారులు.. కోర్టు దృష్టికి అవినాష్ రెడ్డి తీసుకువచ్చిన అంశాలపైనా పూర్తి స్థాయిలో వివరాలను సేకరిస్తున్నారు. రెండు రోజుల క్రితం వివేకా రెండో భార్య షమీమ్ నుండి స్టేట్ మెంట్ తీసుకున్న సీబీఐ అధికారులు తాజాగా వివేకా కుమార్తె సునీత, ఆమె భర్త నర్రెడ్డి రాజశేఖరరెడ్డిలను ఇవేళ విచారించింది.
వివేకా కుటుంబంలో ఆస్తుల సంబంధించిన వివాదాలు కూడా ఉన్నట్లుగా అవినాష్ రెడ్డి ఇంతకు ముందు ఆరోపించారు. ఆ దిశగా సీబీఐ దర్యాప్తు జరపడం లేదని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఇంతకు ముందు వివేకా అల్లుడు నర్రెడ్డి రాజశేఖరరెడ్డికి నోటీసు ఇచ్చి విచారించిన సీబీఐ అధికారులు మరో సారి విచారణ పిలిపించారు. అయితే ఈ సారి రాజశేఖరరెడ్డితో పాటు అతని భార్య, వివేకా కుమార్తె సునీతను కూడా విచారించి స్టేట్ మెంట్ రికార్డు చేసినట్లుగా తెలుస్తొంది. దాదాపు మూడు గంటల పాటు ఇద్దరినీ విచారించారు. కాగా విచారణ ముగిసిన అనంతరం సునీత, రాజశేఖరరెడ్డి సీబీఐ కార్యాలయం నుండి వెళ్లిపోయారు.
మరో సీబీఐ బృందం పులివెందులకు వెళ్లింది. ఈ కేసులో అప్రూవర్ గా మారిన డ్రైవర్ దస్తగిరి నివాసానికి సీబీఐ అధికారుల బృందం వెళ్లి అతని భద్రతకు సంబంధించి వివరాలను తెలుసుకున్నట్లు తెలుస్తొంది. ఇటీవలే దస్తగిరికి భద్రతను పెంచారు. ఈ కేసులో దస్తగిరి కీలక సాక్షి కావడంతో ఆయనకు పలు జాగ్రత్తలు చెప్పినట్లుగా సమాచారం. ఎటువంటి అనుమానం వచ్చినా తమకు సమాచారం ఇవ్వాలనీ, జాగ్రత్తగా ఉండాలని కూడా సూచించినట్లు తెలుస్తొంది.
TDP BJP: మోడీతో కలిసేందుకు సిద్దమంటున్న చంద్రన్న ..! అమిత్ షా తలుపులు తెరుస్తారా..?