YS Viveka Murder Case: మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ బృందం మరో సారి పులివెందులను సందర్శించింది. కొత్తగా వచ్చిన సీబీఐ సిట్ బృందం ఇవేళ పులివెందులకు చేరుకుని వివేకా ఇంటిని పరిశీలించింది. ఇంట్లో హత్య జరిగిన స్థలాన్ని అధికారులు క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం వివేకా ఇంటి నుండి బయటకు వచ్చిన సీబీఐ అధికారులు సమీపంలో ఉన్న ఎంపి అవినాష్ రెడ్డి నివాసానికి వెళ్లారు. ఎంపీ ఇంటి పరిసరాలను కూడా పరిశీలించిన అధికారులు అక్కడ ఉన్న ఎంపీ పీఏ రమణారెడ్డితో మాట్లాడారు.
విచారణ సమయంలో అవినాష్ రెడ్డి చెప్పిన విషయాలపై క్షేత్ర స్థాయిలో వారికి ఉన్న అనుమానాలను నివృత్తి చేసుకునేందుకు ఎంపీ పీఎతో కలిసి పులివెందుల రింగ్ రోడ్డు వరకూ వెళ్లి వచ్చినట్లు తెలుస్తొంది. అదే విధంగా అవినాష్ రెడ్డి తన ఇంటి నుండి వివేకా ఇంటికి ఎంత సేపటిలో రావచ్చు అనే దానిపైనా మరో సారి క్షుణ్ణంగా పరిశీలించినట్లు తెలుస్తొంది. తదుపరి వివేకా ఇంట్లో పని చేసే కంప్యూటర్ ఆపరేటర్ ఇనయతుల్లాను సీబీ ఐ అధికారులు ప్రశ్నించారు. హత్య జరిగిన రోజు ఇంట్లో ఎవరెవరు ఉన్నారనే దానిపై ఆరా తీశారు.
ఘటన జరిగిన రోజు వివేకా మృతదేహాన్ని ఫోటోలు, వీడియోలు తీసి ఇనయతుల్లానే కుటుంబ సభ్యులకు పంపడంతో సదరు విషయాలను అడిగి తెలుసుకున్నారు. సుప్రీం కోర్టులో సోమవారం ఈ కేసు విచారణ ఉన్న నేపథ్యంలో సీబీఐ అధికారుల తాజా వివేకా ఇంటిని, అవినాష్ నివాసాన్ని పరిశీలించడం ప్రాధాన్యత ను సంతరించుకుంది. విచారణలో భాగంగా నిన్న వివేకా అల్లుడు నర్రెడ్డి రాజశేఖరరెడ్డిని, అంతకు ముందు రోజు వివేకా రెండో భార్య షమీమ్ నుండి సీబీఐ అధికారులు స్టేట్ మెంట్ లను స్వీకరించారు. సోమవారం సుప్రీం కోర్టు ఆదేశాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
చేవెళ్ల సభలో అమిత్ షా సంచలన ప్రకటన ..వాళ్లకు రిజర్వేషన్ రద్దు అంటూ