మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి (వివేకా) హత్య కేసులో సీబీఐ విచారణ మళ్లీ ప్రారంభమైంది. దర్యాప్తు అధికారులపైనే అభియోగాలు ఎదుర్కొంటున్న వారు ఆరోపణలు చేయడం, కోర్టులో ప్రైవేటు కేసులు వేయడం, దర్యాప్తు అధికారులపై కేసులు నమోదు చేయడం తదితర కారణాల నేపథ్యంలో సీబీఐ దర్యాప్తు కొంత కాలంగా నిలిచిపోయింది. దాదాపు ఆరు నెలల తర్వాత సీబీఐ అధికారులు మళ్లీ విచారణ విచారణ చేపట్టారు. సీబీఐ అధికారి అంకిత్ యాదవ్ ఆధ్వర్యంలో పులివెందుల ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్ నందు అనుమానితులను ప్రశ్నించారు. వివేకా పిఏగా, కంప్యూటర్ ఆపరేటర్ గా పని చేసిన ఇనయతుల్లాను సీబీఐ అధికారులు ప్రశ్నించినట్లు తెలుస్తొంది. గతంలో పలు పర్యాయాలు ఇనయతుల్లాను సీబీఐ అధికారులు విచారించారు.
2019 లో వివేకా హత్య జరిగిన తర్వాత ఇంట్లోకి వెళ్లి రక్తపు మడుగులో ఉన్న వివేకా మృతదేహం ఫోటోలు, వీడియోలు తొలుత తీసింది ఇనయతుల్లానేననీ, ఆ ఫోటోలు, వీడియోలు ఇతరులకు అతని సెల్ ఫోన్ నుండే షేర్ అయ్యాయనే ఆరోపణలు ఉన్నాయి. ఈ ఫోటోలు తీసిన సమయంలో వివేకా ఇంట్లో ఎవరెవరు ఉన్నారు. ఫోటోలు ఎవరెవరికి పంపించారు అనే విషయాలపై సీబీఐ అధికారులు ఆరా తీస్తున్నారు. మరో పక్క సీబీఐ అధికారులకు వస్తున్న బెదిరింపుల నేపథ్యంలో దర్యాప్తు వేగవంతంగా సాగడం లేదనీ, ఈ కేసును వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలని కోరుతూ వివేకా కుమార్తె సుప్రీం కోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో .. నిన్న విచారణ జరిపిన సుప్రీం కోర్టు వివరాలు తెలియజేయాలని కోరుతూ సీబీఐ, ఏపి రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే.
ఇదిలా ఉంటే సీబీఐ అధికారులు అరెస్టు చేసిన దేవిరెడ్డి శివశంకరరెడ్డి బెయిల్ పిటిషన్ ను హైకోర్టు డిస్మిస్ చేసిన నేపథ్యంలో అయన సుప్రీం కోర్టును ఆశ్రయించారు. శివశంకర్ రెడ్డి బెయిల్ పిటిషన్ లో ప్రతివాదులుగా సీబీఐ, వైఎస్ సునీత లను చేర్చారు. నిందితుడు శివశంకర్ రెడ్డి తరపున అభిషేక్ మను సంఘ్వీ వాదనలు వినిపించనున్నారు.
వైఎస్ వివేకా హత్య కేసు దర్యాప్తుపై సుప్రీం లో విచారణ .. సీబీఐ, ఏపి సర్కార్ కు నోటీసులు