AP Special Status: ఏపికి ప్రత్యేక హోదా అనేది ముగిసిన అధ్యాయమని కేంద్రం మరో సారి స్పష్టం చేసింది. ఏపికి ప్రత్యేక హోదా, విభజన చట్టంలోని హామీలపై టీడీపీ పార్లమెంట్ సభ్యుడు కె రామ్మోహన్ నాయుడు మంగళవారం లోక్ సభలో అడిగిన ప్రశ్నకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. విభజన చట్టంలో పేర్కొన్న అన్నింటినీ పూర్తి చేసేందుకు ఎప్పటికప్పుడు వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాలతో పాటు ఏపి, తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధులతో ఇప్పటి వరకు 25 సమీక్షా సమావేశాలు జరిగాయన్నారు. రెండు రాష్ట్రాల మధ్య ఏకాబిప్రాయం కోసం నిరంతరం ప్రయత్నిస్తున్నామని చెప్పారు. 14వ ఆర్ధిక సంఘం సిఫార్సులతో ప్రత్యేక హోదా అంశం ముగిసిపోయందని అన్నారు. 2015 -16 నుండి 2019 – 20 మధ్య కేంద్ర ప్రాయోజిత పథకాలను 90:10 నిష్పత్తి కింద వచ్చే మొత్తాన్ని ప్రత్యేక సాయంగా ఏపికి ఇచ్చేందుకు అంగీకరించామని తెలిపారు. 2015 – 16 నుండి 2019-20 వరకు కుదుర్చుకున్న విదేశీ రుణాలకు సంబంధించి అసలు, వడ్డీ కూడా కేంద్రమే చెల్లిస్తుందని మంత్రి నిత్యానంద రాయ్ సమాధానమిచ్చారు.
AP Special Status: ప్రత్యేక హోదా పై మరో సారి స్పష్టత
ఏపీ సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి ఢిల్లీకి వెళ్లిన ప్రతి సారి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను కలిసి ప్రత్యేక హోదాపై వినతి పత్రాన్ని అందిస్తూనే ఉన్నారు. తాజాగా ఇటీవల తిరుపతిలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అధ్యక్షతన జరిగిన సదరన్ జోనల్ సమావేశంలోనూ సీఎం జగన్ ప్రత్యేక హోదా అంశాన్ని ప్రస్తావించారు. గతంలోనే పలు పర్యాయాలు బీజేపీ నేతలు ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయమని పేర్కొన్నారు. ఇప్పుడు కేంద్రం కూడా ప్రత్యేక హోదా పై మరో సారి స్పష్టత ఇచ్చింది. విభజన హామీల్లో ప్రత్యేక హోదా అంశం ఉన్నప్పటికీ గత తెలుగుదేశం ప్రభుత్వ నిర్వాకం వల్ల కేంద్రం ప్రత్యేక హోదాను పక్కన పెట్టేసిందనీ, నాడు చంద్రబాబు ప్రత్యేక హోదాకు బదులుగా ప్రత్యేక ప్యాకేజీకి అంగీకరించడం వల్లనే ఈ పరిస్థితి ఏర్పడిందని వైసీపీ ఆరోపిస్తోంది.