Central Budget : కథనంలోకి వెళ్లే ముందు కింద కొన్ని కేటాయింపుల లెక్కలు చూద్దాం..!
* 3500 కిలోమీటర్ల జాతీయ రహదారుల నిర్మాణానికి రూ. లక్ష, మూడు వేల కోట్లు కేటాయింపు. (మధురై – కొల్లం.., చిత్తూరు – తచ్చుర్ కారిడార్ ) – ఇదీ తమిళనాడుకి వరం. దీంతో పాటూ చెన్నై లో మెట్రో రైల్ ప్రాజెక్టుకి రూ. 63 వేల కోట్లు కేటాయింపు..!!
* 1100 కిలోమీటర్లు జాతీయ రహదారుల నిర్మాణానికి రూ. 65 వేల కోట్లు కేటాయింపు. ఇది కేరళలో… ఇక పశ్చిమ బెంగాల్లో 675 కిలోమీటర్ల జాతీయ రహదారుల నిర్మాణానికి రూ. 25 వేల కోట్లు..!
* చెన్నై మెట్రో రైల్వే రెండో దశకి రూ. 63 వేల కోట్లు. బెంగుళూరు మెట్రోకి రూ. 14 వేల కోట్లు..! కొచ్చి మెట్రోకీ రూ. 1479 కోట్లు..! నాగ్ పూర్, నాసిక్ మెట్రోలకు రూ. 5976 .., 2092 కోట్లు కేటాయింపు..!
ఏపీలో జాతీయ రహదారులు అవసరం లేదు..? మెట్రో రైల్వే లైన్లు అవసరం లేదు..? బహుశా మోడీ, నిర్మల సీతారామన్ ఇలాగే అనుకుని ఉండవచ్చు. మన ఎంపీలకు, మన రాష్ట్ర ప్రభుత్వానికి కూడా గట్టిగా అడగాల్సిన అవసరం లేకపోవచ్చు. మనం అడగాల్సినవి “జడ్జిల బదిలీ, జడ్జిలపై చర్యలు, మూడు రాజధానుల ఆమోదం.., ఎన్నికల కమీషనర్ తొలగింపు” ఇవి తప్ప ఇంకేమి మనకు అవసరం లేకపోవచ్చు..! సో.., బీజేపీ అంతే- మనం ఇంతే. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు అంతే, ఇప్పుడు ఇంతే..!
సో.. ఏపీలో ఎన్నికలు లేవు. అందుకే ఏపీకి గుండు సున్నా అని సింపుల్ గా చెప్పేసుకోవచ్చు. తమిళనాడులో ఈ ఏడాది మే నెలలో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. అక్కడ గెలుపు కోసం బీజేపీ తహతహలాడుతోంది. కేరళ, పశ్చిమ బెంగాల్ లో కూడా అదే పరిస్థితి. అందుకే జాతీయ రహదారులు, రైల్వే కేటాయింపుల్లో ఆ రాష్ట్రాలకు సింహభాగం వెళ్లిపోయాయి. కాకపోతే ఏపీ ఏం పాపం జరిగిందో.. ఒక్క ప్రాజెక్టు లేదు, ఒక్క కొత్త కేటాయింపు లేదు..!