AP Capital: ఏపి రాజధాని అమరావతి పేరుతో కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ లో ప్రొవిజన్ పెట్టడం రాష్ట్రంలో తీవ్ర చర్చనీయాంశం అవుతోంది. ఓ పక్క ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి, ప్రభుత్వ పెద్దలు మూడు రాజధానులకు కట్టుబడి ఉన్నామనీ, త్వరలో మెరుగైన వికేంద్రీకరణ బిల్లు తీసుకురానున్నామని చెబుతున్న వేళ కేంద్ర ప్రభుత్వం అమరావతిని ఏపి రాజధానిగా పేర్కొంటూ 2022 – 23 బడ్జెట్ లో కేటాయింపులు చేయడం, విభజన చట్టం ప్రకారం రాజధాని నిర్మాణానికి నిధులు కేటాయించడం అమరావతినే రాజధానిగా కొనసాగించాలని ఆందోళన చేస్తున్న వారికి సంతోషాన్ని కల్గించింది. కేంద్ర ప్రభుత్వమే అమరావతిని రాజధానిగా గుర్తిస్తూ బడ్జెట్ లో కేటాయించిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఇక రాజధాని వికేంద్రీకరణ అంశాన్ని విరమించుకోవాలని కోరుతున్నారు.
AP Capital: అమరావతిలో సచివాలయం, ఉద్యోగుల ఇళ్ల నిర్మాణానికి నిధులు
కేంద్ర బడ్జెట్ లో పట్టణాభివృద్ధి శాఖ నుండి అమరావతిలో సచివాలయం, ఉద్యోగుల ఇళ్ల నిర్మాణానికి నిధులు కేటాయిస్తూ ప్రొవిజన్ తీసుకొచ్చింది. సచివాలయ నిర్మాణానికి రూ.1,214 కోట్లు, ఉద్యోగుల నివాస గృహాలకు రూ.1,126 కోట్ల అంచనా వ్యయంగా ప్రొవిజన్ లో కేంద్రం పేర్కొంది. జిపీఓఏకి భూసేకరణ వ్యయం రూ.6.69 కోట్లుగా కేంద్రం అంచనా వేసింది. 2020-21, 2021-22 బడ్జెట్ లలో మొత్తం 4.48 కోట్లే ఖర్చు చేసినట్లు కేంద్రం తెలిపింది. 2021 – 22 బడ్జెట్ లో ఉద్యోగుల నివాస గృహాల భూసేకరణ వ్యయం రూ.21 కోట్లుగా అంచనా వేసిన కేంద్రం.. 18.30 కోట్లు ఖర్చు చేసింది. 200 ఏజీ స్టాఫ్ క్వార్టర్స్ నిర్మాణ వ్యయాన్ని రూ.200 కోట్లుగా కేంద్రం అంచనా వేసింది. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ డిమాండ్స్ ఫర్ గ్రాంట్ ల ఈ వివరాలు వెలుగులోకి వచ్చాయి.
AP Capital: మూడు రాజధానుల కన్సెప్ట్
టీడీపీ అధికారంలో ఉండగా అమరావతి రాజధానిగా నిర్ణయించిన సంగతి తెలిసిందే. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత సీఎం జగన్మోహనరెడ్డి రాష్ట్రంలోని మూడు ప్రాంతాల అభివృద్ధి కోసం అంటూ మూడు రాజధానుల కన్సెప్ట్ తీసుకువచ్చారు. దీంతో రాజధాని కోసం అమరావతి ప్రాంతంలో భూములు ఇచ్చిన రైతులో ఆందోళన కార్యక్రమాలు ప్రారంభించడంతో పాటు కోర్టులో పిటిషన్ లు దాఖలు చేశారు. గత రెండేళ్లకు పైగా హైకోర్టులో కేసు విచారణ జరుగుతుండగానే రెండు నెలల క్రితం రాజధాని వికేంద్రీకరణ బిల్లును ఉపసంహరించుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది.
త్వరలో మెరుగైన బిల్లు
ఆ తరువాత సీఆర్డీఏ రద్దు, రాజధాని వికేంద్రీకరణ రద్దు బిల్లులను అసెంబ్లీలో ప్రవేశపెట్టి ఆమోదించారు. అయితే ఈ బిల్లులో లోపాలు ఉన్నందున తరువాత అసెంబ్లీ సమావేశాల్లో మెరుగైన బిల్లు తీసుకువస్తామని ప్రభుత్వం తెలిపింది. మరో పక్క అమరావతినే రాజధానిగా కొనసాగించాలని కోరుతూ అమరావతి జేఏసి ఆధ్వర్యంలో నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ తరుణంలో కేంద్ర ప్రభుత్వం రాజధాని అమరావతిని గుర్తిస్తూ బడ్జెట్ లో నిధుల కేటాయింపు జరపడంతో రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.