సోలార్ పార్కుల అభివృద్ధి పథకం కింద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 4100 మెగావాట్ల సామర్థ్యంతో 5 సోలార్ పార్కులు మంజూరు చేసినట్లు కేంద్ర పునరుత్పాదక శక్తి, విద్యుత్ శాఖల మంత్రి ఆర్ కే సింగ్ వెల్లడించారు. రాజ్యసభలో వైసీపీ సభ్యులు విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి సింగ్ రాతపూర్వకంగా సమాధానం ఇచ్చారు. అనంతపురంలో రెండు, కర్నూలు, వైఎస్సార్ జిల్లాలో ఒక్కో సోలార్ పార్కు, రామగిరిలో సోలార్ విండ్ హైబ్రీడ్ పార్కుల అభివృద్ధికి కేంద్ర ప్రభత్వ ఆర్థిక సహాయం కింద రూ.590.80 కోట్లు విడుదల చేసినట్లు ఆయన చెప్పారు. అనంతపురంలో 1400 మెగావాట్ల సోలార్ పార్కు-1కు రూ.244.81 కోట్లు, 500 మెగావాట్ల పార్కు-2కు రూ.91.24 కోట్లు, వైఎస్సార్ జిల్లాలోని 1000 మెగావాట్ల సోలార్ పార్కుకు రూ.54.25 కోట్లు, కర్నూలులో 1000 మెగావాట్ల పార్కుకు రూ.200.25 కోట్లు చొప్పున ఆర్థిక సహాయాన్ని విడుదల చేసినట్లు తెలిపారు.

అనంతపురంలో 1400 మెగావాట్ల సోలార్ పార్కు-1, కర్నూలులో 1000 మెగావాట్ల సోలార్ పార్కు స్థాపిత సామర్థ్యం మేరకు పూర్తి స్థాయిలో పని చేస్తున్నాయన్నారు. వైఎస్సార్ జిల్లాలో 1000 మెగావాట్ల సామర్థ్యానికి గాను 250 మెగావాట్లు, అనంతపురంలోని రెండవ సోలార్ పార్కు 500 మెగావాట్ల సామర్థ్యానికి గాను 400 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యంతో నడుస్తున్నట్లు మంత్రి చెప్పారు. రామగిరిలో 200 మెగావాట్ల సామర్థ్యంతో ఆమోదం పొందిన సోలార్ విండ్ హైబ్రిడ్ పార్కును ప్రారంభించాల్సి ఉందని తెలిపారు.
సోలార్ పార్కులో ఒక మెగావాట్ విద్యుత్ సామర్థ్యం నెలకొల్పేందుకు సరాసరి రూ.4 కోట్లు ఖర్చు అవుతుందన్నారు. ఈ మేరకు మొత్తం 4100 మెగావాట్ల సామర్థ్యం గల 5 పార్కులకు సుమారు రూ.16,400 కోట్లు వ్యయం అవుతుందని మంత్రి తెలిపారు. డీపీఆర్ తయారు చేసేందుకు ఒక్కో సోలార్ పార్కుకు రూ.25 లక్షలు, అదనంగా ఒక్కో మెగావాట్ స్థాపనకు రూ.20 లక్షలు లేదా 30% నిధులు కేంద్రం చెల్లిస్తున్నట్లు మంత్రి చెప్పారు. సోలార్ పార్కులు పూర్తి చేసేందుకు ఈ పథకాన్ని 2024 మార్చి వరకు పొడిగించినట్లు మంత్రి సింగ్ తెలిపారు.
ఎమ్మెల్యేల కొనుగోలు కేసు.. ప్రభుత్వ పిటిషన్ పై కీలక ప్రశ్నలను సంధించిన సింగిల్ బెంచ్