బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ గాలి తీసేశారు కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్. రాష్ట్రంలో వైసీపీ నాయకత్వం పట్ల కేంద్రంలోని బీజేపీ పెద్దలు ఒక విధంగా రాష్ట్రంలోని కొందరు బీజేపీ నేతలు మరోలా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. కేంద్రంలోని బీజేపీ రాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలో ఎన్ డీ ఏ అభ్యర్ధి ద్రౌపది ముర్మూను ఖరారు చేసిన మరుసటి రోజునే వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి ఆమెను కలిసి అభినందనలు తెలియజేశారు. ఆ తరువాత ద్రౌపది ముర్మూ నామినేషన్ కార్యక్రమంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహనరెడ్డి పాల్గొనలేకపోయారు. అదే రోజు మంత్రివర్గ సమావేశం ఉండటంతో వైసీపీ తరపున రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డిని పంపిన విషయం తెలిసిందే. దీంతో ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్ధి ద్రౌపది ముర్ము మద్దతు ఇస్తున్నట్లు స్పష్టం అయింది.
అయితే బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ ..రాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతు ఇవ్వాలని వైసీపీని తాము కోరలేదని చెప్పారు. ఆదివారం విజయవాడలో రాష్ట్ర పదాధికారులు సమావేశం ఆయన పాల్గొన్నారు. అనంతరం మీడియా సమావేశంలో ఏరకంగా చూసినా ఆ పార్టీ తమకు అంటరానిదేనని అన్నారు. తమ పార్టీ జాతీయ నాయకత్వమూ వైసీపీ మద్దతు అడగలేదని సత్యకుమార్ వెల్లడించారు. వైసీపీ కేంద్రంలో ఒకలా, రాష్ట్రంలో మరోలా డ్యూయల్ రోల్ ప్లే చేస్తోందని విమర్శించారు. సాగు చట్టాలు, సీఏఏ బిల్లుల విషయంలో పార్లమెంట్ లో ఎన్ డీ ఏ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చిన వైసీపీ .. ఆ తరువాత రాష్ట్రంలో వాటికి వ్యతిరేకంగా పలు చోట్ల ఆందోళనలు నిర్వహించిందని, భారత్ బంద్ కూ మద్దతు తెలిపిందని ఆయన అన్నారు.
సత్యకుమార్ చేసిన వ్యాఖ్యలకు భిన్నంగా కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ వ్యాఖ్యానించారు. సత్యకుమార్ మీడియాతో మాట్లాడిన మరుసటి రోజే రాష్ట్రపతి అభ్యర్ధి ద్రౌపది ముర్ము మద్దతు విషయంలో ఆయన వ్యాఖ్యలు తప్పు అన్నట్లుగా షెకావత్ వివరణ ఇచ్చారు. ద్రౌపది ముర్మును రాష్ట్రపతి అభ్యర్ధిగా ఎంపిక చేసిన వెంటనే ఎన్ డీ ఏ భాగస్వామ్య పక్షాలన్నింటికి మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేసినట్లు పేర్కొన్న గజేంద్ర సింగ్ షెకావత్.. అలానే వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహనరెడ్డికి విజ్ఞప్తి చేసినట్లు చెప్పారు. ద్రౌపది ముర్ము నామినేషన్ కార్యక్రమానికి వైసీపీ ప్లోర్ లీడర్ ఇతర నాయకులు పాల్గొన్నట్లు వెల్లడించారు. గజేంద్ర సింగ్ షెకావత్ కేంద్ర మంత్రే కాకుండా కేంద్ర బీజేపీ నాయకుడు. గజేంద్ర సింగ్ వ్యాఖ్యలతో సత్యకుమార్ రాష్ట్రపతి అభ్యర్ధి ద్రౌపది ముర్ము మద్దతు విషయంలో అవగాహన లేకుండా మాట్లాడినట్లు అయ్యింది. మరో పక్క ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్ధి ద్రౌపది ముర్ము తన ప్రచారంలో భాగంగా రేపు ఏపికి వస్తున్నారు. మంగళగిరిలో వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలతో ఏర్పాటు చేసే సమావేశంలో పాల్గొనున్నారు. ఆ తరువాత తాడేపల్లి సీఎం క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్ ఏర్పాటు చేసే తేనీటి విందులో పాల్గొంటారు.
సుప్రీంలో మహా పంచాయతీ .. ఉద్దవ్ వర్గానికి స్వల ఊరట
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?