Nitin Gadkari: రాష్ట్రం ఎగుమతులను పెంచుకోవాల్సిన అవసరం ఉందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కారీ సూచించారు. రాష్ట్రంలో రెండు కీలకమైన పోర్టులు ఉన్నాయనీ వీటి ద్వారా ఎగుమతులను పెంచుకోవచ్చని అన్నారు. విజయవాడ బెంజ్ సర్కిల్ ఫ్లైఓవర్ ను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డితో కలసి ఆయన ప్రారంభించారు. అనంతరం ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం నుండి సీఎం జగన్, కేంద్ర మంత్రి గడ్కారీ జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ నిర్మించిన 20 రహదారులు, ఇతర ప్రాజెక్టులను ప్రారంభించారు. 31 జాతీయ రహదారుల ప్రాజెక్టులకు భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో కేంద్ర మంత్రి మాట్లాడుతూ ఏపిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయడం సంతోషంగా ఉందన్నారు. రహదారుల అభివృద్ధితోనే దేశాభివృద్ధి అని వాజ్ పేయి నమ్మారనీ, వాజ్ పేయి హయాంలోనే స్వర్ణ చతుర్భుజి నిర్మాణం జరిగిందని తెలిపారు. కేంద్రం నిర్మహిస్తున్న గ్రామ సడగ్ యోజన ఇప్పుడు అత్యంత కీలకమని అన్నారు. పోర్టుల అభివృద్ధికి రహదారుల నిర్మాణం చాలా ముఖ్యమని కేంద్ర మంత్రి అన్నారు.
Nitin Gadkari: రహదారుల నిర్మాణానికి నిధుల కొరత లేదు
రహదారుల నిర్మాణానికి నిధుల కొరత లేదని చెప్పారు. గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ ప్రెస్ హైవేలు నిర్మాణం జరగాల్సి ఉందన్నారు. దాదర్ ఎక్స్ ప్రెస్ వే తనకు కూడా చాలా ప్రత్యేకమైందనీ, తన నియోజకవర్గం నాగ్ పూర్ నుండి విజయవాడకు రోడ్ వస్తుందన్నారు. ఏపి శరవేగంగా అభివృద్ధి చెందుతోందనీ, ఏపి చరిత్రలో ఇది సువర్ణాధ్యాయంగా అభివర్ణించారు. సీఎం జగన్ ప్రతిపాదనపై ఈస్ట్రన్ రింగ్ రోడ్డుకు తక్షణం ఆమోదం తెలుపుతున్నట్లు ప్రకటించారు కేంద్ర మంత్రి గడ్కారీ. ఏపిలో 3 లక్షల కోట్ల విలువైన రోడ్లు నిర్మిస్తామన్నారు. ఏపిలో ఆరు గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ ప్రెస్ హైవేలను కేంద్రం నిర్మిస్తోందన్నారు. 2024 నాటికి రాయపూర్ – విశాఖ గ్రీన్ ఫీల్డ్ హైవే పూర్తి చేస్తామన్నారు. పరిశ్రమలతోనే ఉపాధి సాధ్యమని అన్నారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి అయిన తరువాత వ్యక్తిగతంగా వస్తానని మంత్రి హామీ ఇచ్చారు. తాను జలవనరుల మంత్రి కాకపోయినా పోలవరం చూస్తానని పేర్కొన్నారు.
రాష్ట్రంలో రహదారుల రూపు రేఖలు మారుస్తా
సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రానికి కేంద్రం అందిస్తున్న సహకారానికి ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రంలో 51 ప్రాజెక్టులకు కేంద్రం సహకారం అందిస్తోందన్నారు. ఈ సందర్భంలో కేంద్ర మంత్రులు నితిన్ గడ్కారీ, కిషన్ రెడ్డిలకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. కేంద్ర సహకారంతో రాష్ట్రంలో రహదారుల రూపు రేఖలు మారుస్తామని అన్నారు. తొలుత కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి గన్నవరం విమానాశ్రయంలో రాష్ట్ర ప్రభుత్వం తరపున మంత్రి శంకర్ నారాయణ, ఎంపీ బాలశౌరి స్వాగతం పలికారు. బీజేపీ తరపున రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, బీజేపీ ఎంపీలు సుజనా చౌదరి, సీఎం రమేష్, ఎమ్మెల్సీ మాధవ్ స్వాగతం పలికారు. అనంతరం ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ ను తిలకించారు. ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.