కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేఖలు రాశారు. నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుల డీపిఆర్ లను వెంటనే సమర్పించాలని ఆయన లేఖలో పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం కృష్ణానదిపై ఎనిమిది, గోదావరి నదిపై ఏడు ప్రాజెక్టులకు డిపిఆర్ లను సమర్పించాల్సి ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కృష్ణానదిపై 15, గోదావరి నదిపై నాలుగు కొత్త ప్రాజెక్టులు చేపట్టగా ఒక్క పురుషోత్తమపట్నం ప్రాజెక్టుకు మాత్రమే డీపీఆర్ సమర్పించింది.
కృష్ణా, గోదావరి నదులపైే నిర్మాణంలో ఉన్న ప్రాాజెక్టులపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు పరస్పరం కేంద్రానికి ఫిర్యాదులు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గత ఏడాది అక్టోబర్ ఆరవ తేదీన జరిగిన అపెక్స్ కౌన్సిల్ భేటీలో తీసుకున్న నిర్ణయాల అమలులో భాగంగా డీపిఆర్ లు ఇవ్వాలని కేంద్ర మంత్రి లేఖలో కోరారు. తెలంగాణ, ఏపిలో చేపట్టిన కొత్త ప్రాజెక్టులకు అనుమతి తప్పనిసరి అని కేంద్ర మంత్రి షెకావత్ తెలిపారు. డిపిఆర్ లు సహా అన్ని రకాల అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలని ఆయన సూచించారు. అపెక్స్ కౌన్సిల్ నిర్ణయం మేరకు ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు నడుచుకోవాలని కోరారు. డీపీఆర్ లు, ఇతర వివరాలు సమర్పిస్తేనే సమస్య పరిష్కారం అవుతుందని కేంద్ర మంత్రి షెకావత్ పేర్కొన్నారు. కేంద్ర మంత్రి లేఖలపై ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాలి.