Desha Bill: ఏపిలో మహిళల రక్షణ కోసం సీఎం వైఎస్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం దిశ బిల్లును ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. దిశ బిల్లుకు అసెంబ్లీలో ఆమోదించి కేంద్రానికి పంపగా గతంలోనే కొన్ని అభ్యంతరాలతో వెనక్కు తిప్పి పంపించింది. దిశ బిల్లు చట్టం కాకమునుపే ఏపి ప్రభుత్వం దిశ పోలీస్ స్టేషన్ లను ఏర్పాటు చేసింది. సిబ్బందిని కేటాయించింది. దిశ బిల్లుకు సంబంధించి కేంద్రం సూచించిన మార్పులతో మరల పంపడం జరిగిందని గతంలోనే హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత తెలియజేశారు. దీంతో ఈ బిల్లు కేంద్రం వద్ద పెండింగ్ లో ఉందని అందరూ భావించారు.
అయితే అధికార యంత్రాంగం చేసిన తప్పిదాల కారణంగా అనేక సందర్భాల్లో ప్రభుత్వం నామర్ధ పడాల్సి వస్తుంది. ఇప్పటికే ముందు చూపు, తదుపరి వచ్చే న్యాయపరమైన చిక్కుల గురించి ఆలోచించకుండా అనేక జీవోలు ఇవ్వడం, అవి కోర్టులకు వెళ్లడంతో కొట్టివేయడం జరుగుతోంది. ఇప్పుడు తాజాగా అధికారుల నిర్వాకం కారణంగా అధికార పార్టీ ఎంపీనే కేంద్రం వద్ద దిశ బిల్లుకు సంబంధించి ప్రశ్న అడిగి నామోషి పడాల్సి వచ్చింది. సదరు బిల్లుపై ప్రశ్న వేసే ముందు ఎంపి రాష్ట్ర పోలీస్ యంత్రాంగాన్ని అడిగి ఉంటే నేడు ఈ పరిస్థితి వచ్చేది కాదు.
రాష్ట్రంలోని ప్రజలు, ప్రజా ప్రతినిధులు కూడా ఇప్పటి వరకూ దిశ బిల్లు ఇంకా కేంద్రం వద్దనే పెండింగ్ లో ఉందని భావిస్తున్న తరుణంలో వైసీపీ ఎంపి గోరంట్ల మాధవ్ అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి ఇచ్చిన షాకింగ్ సమాధానంతో అవాక్కు అవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కేంద్ర హోంశాఖ లేవనెత్తిన అభ్యంతరాలకు, వివరణలకు రాష్ట్ర ప్రభుత్వం స్పందించలేదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ కుమార్ మిశ్రా లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. దిశ బిల్లుపై ప్రశ్న అడిగి ప్రతిపక్షాలు విమర్శ చేయడానికి అస్కారం కల్పించినట్లు అయ్యింది. దీన్ని మీరు ఏ విధంగా అర్థం చేసుకుంటారు?