Central team Meets CM Jagan: ఏపిలో వరద నష్టం అంచనాకు వచ్చిన కేంద్ర బృందం జగన్ సర్కార్ పనితీరుపై ప్రశంసల వర్షం కురిపించింది. గత మూడు రోజులుగా కేంద్ర బృందం వరద ప్రభావిత జిల్లాల్లో పర్యటించిన సంగతి తెలిసిందే. ఈ బృందంతో సోమవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి భేటీ అయ్యారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో తాము పరిశీలించిన అంశాలను సీఎం వైఎస్ జగన్ కు కేంద్ర బృందం వివరించింది. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఎన్ఎండీఏ సలహాదారు కునాల్ సత్యార్ధి వివరాలను అందించారు.
Central team Meets CM Jagan: కడప జిల్లాలో వరదల నష్టం అధికం
ఈ సందర్భంగా కునాల్ సత్యార్ధి మాట్లాడుతూ మూడు రోజుల పాటు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించామనీ, కడప జిల్లాకు భారీ నష్టం వాటిల్లిందని తెలిపారు. రోడ్లు, భవనాలు, ప్రాజెక్టులు లాంటి మౌలిక సదుపాయాలు బాగా దెబ్బతిన్నాయనీ, పశువులు చనిపోవడం జరిగిందన్నారు. తమ పర్యటనలో రాష్ట్ర ప్రభుత్వ అధికారులు సహకరించారని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ పనితీరు ప్రశంసనీయమన్నారు. కరువు ప్రాంతంలో అతి భారీ వర్షాలు కురిశాయనీ, ఈ స్థాయిలో వరదను నియంత్రించగలిగే రిజర్వాయర్లు, డ్యామ్ లు ఈ ప్రాంతంలో లేవని అన్నారు. ఉన్న డ్యామ్ లు, రిజర్వాయర్ లు కూడా ఈ స్థాయి వరదలను ఊహించి నిర్మించినవి కావని పేర్కొన్నారు. కరువు ప్రాంతంలో కుంభవృష్టి. నిరంతరం మంచి వర్షాలు కురిసే ప్రాంతంలో కరువు లాంటి పరిస్థితులు నెలకొంటున్నాయని అన్నారు. కడప జిల్లాలో వరదల వల్ల నష్టం అధికంగా ఉందన్నారు. అన్నమయ్య ప్రాజెక్టు తెగిపోయిన చోట నష్టం అపారంగా ఉందన్నారు.
చిత్తూరు జిల్లాలో కొంత భాగం, నెల్లూరు జిల్లాలో కూడా వరదల ప్రభావం అధికంగా ఉందని అన్నారు. కడప జిల్లాలో మౌలిక సదుపాయాల నిర్మాణాలు దారుణంగా దెబ్బతిన్నాయనీ, పంటలకు తీవ్ర నష్టం వాటిల్లిందన్నారు. రైతుల పంట చేతికి అందే సమయంలో నీట పాలైందన్నారు. వరద బాధిత ప్రాంతాల్లో అధికారుల పని తీరు ప్రశంసనీయమన్నారు. సహాయ కార్యక్రమాలకు కలెక్టర్ లు తక్షణం నిధులు విడుదల చేశారన్నారు. యుద్ద ప్రాతిపదికన పనులు జరిగాయన్నారు. వీలైనంతమేర ఆదుకునేందుకు తమ వంతు సహకారం అందిస్తామని సత్యార్ధి పేర్కొన్నారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ కేంద్ర బృందానికి ధన్యవాదాలు తెలియజేశారు. అయితే ధాన్యం కొనుగోలులో నిబంధనల సడలింపు చేయాలని ఏపి ప్రభుత్వం కోరింది. భారీ వర్షాలు కారణంగా పంటలు దెబ్బతిన్నందున తేమ, ఇతరత్రా నిబంధనల విషయంలో సడలింపులు ఇవ్వాలని కోరింది.