ఏపిలో ఇటీవల కురిసిన భారీ వర్షాలు, గోదావరి వరదల వల్ల వందలాది గ్రామాలు , వేలాది ఎకరాల పంట ముంపునకు గురైన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో పెద్ద ఎత్తున జరిగిన నష్టంపై రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి నివేదించింది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గత నెలలోనే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను కలిసి ఏపి, తెలంగాణలో గోదావరి వరదల వల్ల జరిగిన తీవ్ర నష్టాన్ని వివరించారు. ఈ నేపథ్యంలో గోదావరి వరద ప్రభావిత ప్రాంతాల్లో నష్టాన్ని అంచనా వేయడానికి కేంద్ర బృందాల పర్యటన ఖరారు అయ్యింది. ఈ రోజు (మంగళవారం) నుండి మూడు రోజుల పాటు ఈ బృందాలు ఏపిలో పర్యటించనున్నాయి. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆర్ధిక సలహాదారు (ఎన్డీఎంఏ) రవినేష్ కుమార్ నేతృత్వంలో ఆరుగురు సభ్యులు రెండు బృందాలుగా వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి నష్టాన్ని అంచనా వేయనున్నారు.
ఈ రోజు మధ్యాహ్నం కేంద్ర బృందం ఢిల్లీ నుండి నేరగా విశాఖపట్నం చేరుకుంటుంది. ముందుగా రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో సమావేశమై వరద పరిస్థితులు, జరిగిన నష్టాలకు సంబంధించి వివరాలు సేకరిస్తారు. రాత్రి విశాఖలోనే బస చేసి రేపు, ఎల్లుండి (బుధ, గురువారాల్లో) అల్లూరి సీతారామరాజు, బీఆర్ అంబేద్కర్ కోనసీమ, ఏలూరు జిల్లాల్లో కేంద్ర బృందం ప్రతినిధులు పర్యటిస్తారు. ఆ తర్వాత రెండు బృందాలు కలిసి విజయవాడ చేరుకుని సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డితో సమావేశమవుతాయి. కేంద్ర బృందం ప్రతినిధులు గురువారం రాత్రి విజయవాడలోనే బస చేసి 12న (శుక్రవారం) తిరిగి ఢిల్లీకి వెళ్తారు. కేంద్ర బృందంలో డాక్టర్ కె మన్మోహన్, శ్రావణ్ కుమార్ సింగ్, పి దేవేందర్ రావు, ఎఁ మురుగునాథన్, అరవింద్ కుమార్ సోని సభ్యులుగా ఉన్నారని ఏపి విపత్తుల సంస్థ ఎండీ బీఆర్ అంబేద్కర్ తెలిపారు.