Corona: గత ఏడాదిగా కలకలం సృష్టిస్తున్న కరోనా మహమ్మారి ఇంకా తన ఉధృతిని కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం దేశంలో కరోనా కేసులు రోజురోజుకీ విపరీతంగా పెరుగుతున్నాయి. ఈ తరుణంలో తాజాగా కీలక నిర్ణయం వెలువడింది. కరోనా రోగులకు చికిత్సలో ఉపయోగించే కీలకమైన యాంటీ వైరల్ డ్రగ్ రెమిడిసివిర్ తో పాటు రెమిడిసివిర్ యాక్టివ్ ఫార్మాన్యూటికల్ ఇన్ గ్రేడియంట్ (API) ఎగుమతులపై కేంద్రం నిషేధం విధించింది. ఇదే సమయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సైతం కీలక ప్రకటన చేసింది.
ఇదీ లెక్క…
ఎబోలా వైరస్ చికిత్సలో ఉపయోగించే రెమిడిసిమిర్ ఇంజక్షన్ కరోనా తీవ్రతను తగ్గించడంలోనూ విజయవంతంగా పని చేస్తోంది. వీటిని యూఎస్ దిగ్గజ ఫార్మా కంపెనీ గిలీడ్ సైన్సెస్ నుంచి వాలంటరీ లైసెన్సింగ్ తీసుకొని చాలా కంపెనీలు మన దేశంలో తయారు చేస్తున్నాయి. భారత్ లో ప్రతి నెలా సుమారుగా 38.80 లక్షల రెమిడిసివిర్ ఇంజక్షన్లు రూపొందుతున్నాయి. తాజాగా కరోనా విస్తృతి పెరగడంతో చికిత్సలో రెమిడిసివిర్ అవసరం పెరిగింది. దేశంలోని కరోనా పేషంట్ లు, ఆస్పత్రుల్లో రెమిడేసివిర్ అందుబాటులో ఉండేందుకు, వాటి కొరత రాకుండా చూసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.
తెలంగాణలో కీలక నిర్ణయం
ప్రజలు మాస్క్ వినియోగించడం తప్పనిసరి చేస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇంటి నుంచి బయటకు వస్తే.. ప్రతీ ఒక్కరూ మాస్క్ పెట్టుకోవాల్సిందేనని సూచించింది. బహిరంగ ప్రదేశాలు, సభలు, సమావేశాల్లో పనిచేస్తున్న కార్యాలయాల్లో ప్రభుత్వం మాస్క్ తప్పనిసరి చేసింది. మాస్క్ పెట్టుకోకపోతే.. డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్, ఐపీసీ సెక్షన్ 188 కింద వెయ్యి రూపాయల ఫైన్ కట్టాల్సిందేనని సర్కార్ చెప్పింది.