Chalo Vijayawada: పీఆర్సీ సాధన సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న చలో విజయవాడ కార్యక్రమాన్ని భగ్నం చేసేందుకు పోలీస్ యంత్రాంగం ఎక్కడికక్కడ అడ్డుకునే ప్రయత్నాలు చేసినా వేలాది మంది ఉద్యోగ, ఉపాధ్యాయ పెన్షనర్లు విజయవాడకు చేరుకున్నారు. చలో విజయవాడ కార్యక్రమం జరుగుతున్న నేపథ్యంలో దీన్ని భగ్నం చేసేందుకు పోలీసులు ఉద్యోగ, ఉపాధ్యాయులను ఎక్కడికక్కడ అరెస్టులు చేసిన సంగతి తెలిసిందే. విజయవాడకు వచ్చే అన్ని మార్గాల్లో చెక్ పోస్టులు ఏర్పాటు చేసి విస్తృతంగా తనిఖీలు చేస్తూ అనుమానం వచ్చిన ఉద్యోగులు, ఉపాధ్యాయులను అదుపులోకి తీసుకుని స్టేషన్ లకు తరలించారు. టోల్ ప్లాజాలు, చెక్ పోస్టుల ప్రతి వాహనాన్ని తనిఖీ చేస్తున్నారు.
Chalo Vijayawada: అడుగడుగునా అడ్డుకున్నా..
రాత్రి నుండే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగ ఉపాధ్యాయ సంఘ నేతలను హౌస్ అరెస్టు చేశారు. చలో విజయవాడ కార్యక్రమానికి పోలీస్ పర్మిషన్ లేదంటూ ఉద్యోగులకు నోటీసులు కూడా ఇచ్చారు. పోలీసుల అనుమతి లేకపోయినా చలో విజయవాడ కార్యక్రమాన్ని నిర్వహించి తీరుతామని పీఆర్సీ సాధన సమితీ నేతలు ప్రకటించారు. వంద మందితో అయినా ధర్నా చౌక్ వద్ద కార్యక్రమాన్ని నిర్వహించి తీరుతామని నేతలు వెల్లడించారు. పలువురు ఉద్యోగులు మారు వేషంలో రైతుల మాదిరిగా, బురకాలు వేసుకుని విజయవాడకు చేరుకున్నా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విజయవాడ రైల్వే స్టేషన్, బస్టాండ్ లలో పెద్ద ఎత్తున ఉద్యోగ ఉపాధ్యాయులను అదుపులోకి తీసుకున్నారు.
Read More: Chalo Vijayawada: విజయవాడలో హైటెన్షన్ .. ఎక్కడికక్కడ ఉద్యోగ, ఉపాధ్యాయులు అరెస్టులు..
Chalo Vijayawada: బీఆర్టీఎస్ రోడ్డు భారీ ర్యాలీ
అయినప్పటికీ వందలాది మంది ఉద్యోగ ఉపాధ్యాయులు విజయవాడకు చేరుకున్నారు. వీరు ఏపి ఎన్జీఓ భవనం నుండి బీఆర్టీఎస్ రోడ్డు వైపు భారీ ర్యాలీగా బయలుదేరారు. వుయ్ వాంట్ జస్టిస్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు. పీఆర్సీ జీవోలు రద్దు చేయాలని ముద్రించిన మాస్కులను ఉద్యోగులు ధరించి ర్యాలీలో పాల్గొన్నారు. అర్దరాత్రి ఇచ్చిన చీకటి జీవోలు రద్దు చేయాలంటూ డిమాండ్ చేశారు. బీఆర్టీఎస్ వేదికపైకి ఉద్యోగులను పోలీసులు అనుమతించకపోవడంతో కొద్దిసేపు రహదారిపై భైటాయించి నినాదాలు చేస్తున్నారు. తరువాత బాడికేడ్లు తోసుకుని బీఆర్టీఎస్ రోడ్డులో భారీ ర్యాలీ నిర్వహించారు. పోలీసు నిర్బంధాలు చేసినా చలో విజయవాడ కార్యక్రమం విజయవంతం అయ్యిందని పీఆర్సీ సాధన సమితి నేతలు పేర్కొంటున్నారు.