Chandra Babu: రాజకీయాల్లో అవకాశాలను అందిపుచ్చుకోవడంలో టీడీపీ అధినేత చంద్రబాబు సమర్ధుడని మరో సారి రుజువు చేసుకుంటున్నారు. గ్రామ పంచాయతీలు మొదలు కొని మండల పరిషత్, జిల్లా పరిషత్, మున్సిపల్ ఎన్నికల వరకూ వరుస పరాజయాలతో డీలాపడాల్సిన చంద్రబాబు వైసీపీ వాళ్లు అందించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని జనాల్లోకి వెళ్లిపోతున్నారు. ఇటీవల అసెంబ్లీలో జరిగిన ఘటన అందరికీ గుర్తుండే ఉంటుంది. చంద్రబాబును అసెంబ్లీలో అధికార పక్ష సభ్యులు తీవ్ర స్థాయిలో విమర్శించడంతో తనతో పాటు తన భార్యను అవమానించే వ్యాఖ్యలు చేశారంటూ చంద్రబాబు అసెంబ్లీలో శపథం చేసి మరీ బైకాట్ చేశారు. మళ్లీ ముఖ్యమంత్రిగానే అసెంబ్లీలో అడుగు పెడతాననీ లేకుంటే ఈ రాజకీయాలే అవసరం లేదని శపథం చేసి బయటకు వచ్చేశారు చంద్రబాబు. దాదాపు రెండేళ్లుగా కరోనా నేపథ్యంలో టీడీపీ నాయకులు గట్టిగా ప్రజల్లోకి వెళ్లడానికి అవకాశం లేకుండా పోయింది. ఒక వేళ నాయకులు సభలు, ర్యాలీలు నిర్వహిస్తే కరోనా నిబంధనలు ఉల్లంఘించారంటూ జగన్ సర్కర్ కేసులు నమోదు చేస్తోంది.
Chandra Babu: వరద బాధితులను పరామర్శిస్తూ..
అయితే ఇప్పుడు చంద్రబాబు జనాల్లోకి వెళ్లడానికి మంచి కాజ్ కూడా దొరికింది. దానికి తోడు అసెంబ్లీలో తన కుటుంబానికి జరిగిన అవమానాన్ని జనాల్లోకి తీసుకువెళ్లి సానుభూతి పొందేందుకు అవకాశం చిక్కింది. భారీ వర్షాలు, వరదల కారణంగా కడప, చిత్తూరు, నెల్లూరు తదితర జిల్లాల్లో ప్రజలు తీవ్రంగా నష్టపోయారు. ఈ ప్రాంతాల్లో బాధితులను పరామర్శించే కార్యక్రమం చేపట్టారు చంద్రబాబు. మూడు రోజుల పర్యటనకు రూట్ మ్యాప్ సిద్దం చేసుకున్న చంద్రబాబు నిన్న కడప జిల్లాలో, నేడు చిత్తూరు జిల్లాలో పర్యటించారు. రేపు నెల్లూరు జిల్లాలో పర్యటించనున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ముంపు ప్రాంతాలను పరిశీలించడంతో పాటు బాధితులను పరామర్శించి పార్టీ తరపున ఆర్ధిక సాయాన్ని అందిస్తున్నారు. కరోనా నిబంధనలు అంటూ ఇప్పుడు టీడీపీ నేతలను పర్యటించకుండా నిలువరించే అవకాశం వైసీపీ ప్రభుత్వానికి లేదు. ఎందుకంటే అధికార పార్టీ నేతలు కూడా ముంపు ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. అయితే వైసీపీ వాళ్లు ఊహించినట్లుగానే చంద్రబాబు ప్రజల్లో సానుభూతి పొందేందుకు అసెంబ్లీలో జరిగిన ఘటనను పదేపదే ప్రస్తావిస్తున్నారు.
రౌడీయిజం చేసి కుప్పం మున్సిపాలిటీని వైసీపీ గెలిచిందని విమర్శిస్తునే..అసెంబ్లీలో జరిగిన ఘటనను వివరిస్తూ వైసీపీ సభ్యులు ఈ విధంగా మాట్లాడటం సమంజసమా అని ప్రశ్నిస్తున్నారు. టీడీపీ 22 ఏళ్లు అధికారంలో ఉన్నా ఏనాడూ తన సతీమణి బయటకు రాలేదనీ, అసెంబ్లీలో ఆమె వ్యక్తిత్వాన్ని కించపరిచేలా వైసీపీ సభ్యులు మాట్లాడారని విమర్శిస్తున్నారు. తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎన్నో సంక్షోభాలను ఎదుర్కొన్నానని ప్రజలకు వివరిస్తున్నారు. అలిపిరిలో తన కారుపై మందుపాతర పేలినా భయపడలేదు కానీ తన సతీమణి పై అనుచిత వ్యాఖ్యలతో ఎంతో బాధపడ్డానని చెప్పుకుంటున్నారు. కౌరవ సభలో ఉండలేనని చెప్పి బయటకు వచ్చేశాననీ, ప్రజా క్షేత్రంలోనే తేల్చుకుంటాననీ అసెంబ్లీలో చెప్పానని వివరిస్తున్నారు చంద్రబాబు. నిన్న కడపలో, నేడు చిత్తూరు జిల్లా పర్యటనలో చంద్రబాబు వైసీపీ సభ్యుల వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ సభలో మాట్లాడటం గమనార్హం.