Chandra Babu: కృష్ణాజిల్లా మైలవరం నియోజకవర్గంలో మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు వాహనంపై రాళ్ల దాడి జరగడాన్ని టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్రంగా ఖండించారు. వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ ప్రోద్భలంతోనే ఆ పార్టీ గుండాలు దాడికి పాల్పడ్డారని చంద్రబాబు ఆరోపించారు. వైసీపీ అవినీతి, అరాచకాలకు చక్రవడ్డీతో సహా మూల్యం చెల్లిస్తామని హెచ్చరించారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిపై హత్యాయత్నం కింద కేసులు నమోదు చేసి అరెస్టు చేయాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. అవినీతి, అక్రమాలను అడ్డుకుంటే దాడులు చేస్తారా అని మండిపడ్డారు.
అక్రమ మైనింగ్ వెలికితీసేందుకు వెళ్లిన దేవినేని ఉమా కారుపై వందలాది మంది దాడి చేయడం పిరికిపంద చర్య అని అన్నారు. ఈ ఘటనను చంద్రబాబు డీజీపీ గౌతమ్ సవాంగ్ కు లేఖ రాశారు. ప్రజల నుండి వచ్చిన ఫిర్యాదులపై మంగళవారం దేవినేని ఉమ కొండపల్లి అటవీ ప్రాంతాన్ని సందర్శిస్తే వైసీపీ గుండాలు చేసిన దాడిలో పలువురు గాయపడగా, ఉమా కారు ధ్వంసమైందని లేఖలో చంద్రబాబు పేర్కొన్నారు. బాధ్యులపై వెంటనే పోలీసులు చర్యలు తీసుకోవాలని కోరారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడే దిశగా పోలీస్ అధిపతిగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
కొండపల్లి అటవీ ప్రాంతంలో అక్రమ మైనింగ్ చేస్తున్నారనే ఆరోపణలపై దేవినేని ఉమా పరిశీలనకు వెళ్లి తిరిగి వస్తుండగా జి కొండూరు మండలం గడ్డమణుగు గ్రామం వద్ద వైసీపీ వర్గీయులు అడ్డుకున్నారు. వాహనం చుట్టుముట్టి దాడికి దిగారు. రాళ్లదాడిలో కారు అద్దాలు ధ్వంసం అయినట్లు తెలుస్తోంది. వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ అనుచరులే దాడికి పాల్పడ్డారని ఉమా ఆరోపించారు. టీడీపీ, వైసీపీ వర్గాలు ఘటనా స్థలానికి చేరుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.