Chandra Babu Naidu: రాష్ట్రంలో వైసీపీ నేతల అవినీతిపై కేసులు పెడితే విచారణకు కోర్టులు కూడా సరిపోవంటూ టీడీపీ అధినేత చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. గుంటూరు జిల్లా చింతలపూడిలో టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే దూళిపాళ్ల నరేంద్రను చంద్రబాబు పరామర్శించారు. సంగం డైయిరీ కేసులో అరెస్టు అయి జైలుకు వెళ్లి వచ్చిన నరేంద్ర ఇంటికి చంద్రబాబు వెళ్లి పరామర్శించారు. ఈ సందర్భంగా నరేంద్ర కు పార్టీ అండగా ఉంటుందని చంద్రబాబు పేర్కొన్నారు. అనంతరం చంద్రబాబు మీడియా సమావేశంలో వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుర్పించారు.
దూళిపాళకు ప్రజలకు కూడా అండగా నిలవాలన్నారు. సుదీర్ఘ రాజకీయ చరిత్ర కల్గిన కుటుంబం నరేంద్రది అని పేర్కొన్న చంద్రబాబు గతంలో దూళిపాళ్ల వీరయ్య చౌదరి ఇప్పుడు నరేంద్ర ఇక్కడి ప్రజలకు, సంగం డెయిరీ రైతాంగానికి అండగా ఉంటున్నారన్నారు. వరుసగా ఈ నియోజకవర్గానికి అయదు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై ప్రజలకు ఎనలేని సేవలు అందించారని నరేంద్రను కొనియాడారు. రైతుల కోసం నిరంతరం కృషి చేసిన నరేంద్ర కుటుంబాన్ని రాజకీయ కక్షతోనే వైసీపీ ప్రభుత్వం కేసుల్లో ఇరికించి ఇబ్బందులకు గురి చేసిందని ఆరోపించారు. విలువలు లేని కక్షసాధింపు రాజకీయాలు చేస్తే ప్రజలు చూస్తూ ఊరుకోరని అన్నారు. సంగం, విశాఖ డెయిరీలు చట్టప్రకారం బదిలీ అయ్యాయని చెప్పారు. సంగం డెయిరీ ఆధ్వర్యంలో ఓ ఆసుపత్రి ఏర్పాటు చేసి డెయిరీ రైతులకు సేవలు అందిస్తున్నారన్నారు.
చట్టాన్ని అల్లంఘించి పని చేసే అధికారులు భవిష్యత్తులో తగిన మూల్యం చెల్లించుకుంటారన్నారు. ఈ ప్రభుత్వ అవినీతిని ప్రశ్నించే అచ్చెన్నాయుడు, నరేంద్ర వంటి వారిని అరెస్టు చేసి ప్రజలను డైవర్ట్ చేస్తున్నారని విమర్శించారు. ఈ ప్రభుత్వంలో చేస్తున్న అవినీతిని విచారించేందుకు కోర్టులు కూడా చాలవని వ్యాఖ్యానించారు. ప్రభుత్వం ఇదే విధంగా ముందుకు వెళితే రాబోయే రోజుల్లో తీవ్ర పరిణామాలు ఉంటాయన్నారు. సోషల్ మీడియా కేసులో అరెస్టు చేయవద్దని సుప్రీం కొర్టు చెప్పినా వీళ్లు అరెస్టులు చేస్తున్నారన్నారు. ఈ ప్రభుత్వం సర్పంచ్ల అధికారాలను సైతం నిర్వీర్యం చేయాలని చూస్తే కోర్టు అక్షింతలు వేసిందన్నారు.