Chandra Babu : కేంద్ర ప్రభుత్వం దక్షిణాది రాష్ట్రాలపై సవతితల్లి ప్రేమ చూపిస్తోందన్న మాట చాలా కాలంగా వినిపిస్తోంది. జీఎస్టీ బకాయిలు చెల్లింపుల విషయంతో పాటు కేంద్ర బడ్జెట్ కేటాయింపుల్లోనూ ఏపి, తెలంగాణ, తమిళనాడు తదితర రాష్ట్రాలకు అన్యాయం చేస్తున్నదని అన్ని పార్టీల నేతలు పేర్కొంటున్నారు. అదే విధంగా కేంద్రంలోని బీజెపీ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలతో ఎటువంటి ముందస్తు సమాలోచనలు చేయకుండా పలు కీలక నిర్ణయాలు తీసుకుంటూ వాటికి రాష్ట్ర ప్రభుత్వాలపై బలవంతంగా ఒప్పిస్తోందన్న విమర్శలు ఉన్నాయి. ఇటీవల కేంద్ర బడ్జెట్ లో ఈ రాష్ట్రాలకు ప్రాధాన్యత లేకపోవడంపై వైసీపీకి చెందిన ఎంపి విజయసాయి రెడ్డి తదితరులు బాహాటంగానే కేంద్రాన్ని విమర్శించారు. దక్షిణాదిపై కేంద్రం సవతితల్లి ప్రేమ చూపుతోందని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకునే పలు నిర్ణయాలు ప్రజలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
కేంద్రం తీసుకువచ్చిన నూతన సాగు చట్టాలను వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున రోజుల తరబడి ఆందోళన చేస్తున్నా, రైతు సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన భారత్ బంద్ విజయవంతం అయినా కేంద్రం ఏ మాత్రం వెనక్కు తగ్గడం లేదు. భాగస్వామ్య పక్షాలతో సంబంధం లేకుండానే పార్లమెంట్ బీజేపీకి 303 స్థానాలు ఉండటంతో ప్రధాన మంత్రి మోడీ తాను అనుకున్నది చేస్తూ ముందుకు సాగుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా విశాఖ ఉక్కు పరిశ్రమ విషయంలోనూ కేంద్రం వివాదాస్పద నిర్ణయం తీసుకున్నది. ఈ నిర్ణయాన్ని రాష్ట్రంలోని బీజేపీతో సహా అన్ని రాజకీయ పక్షాలు వ్యతిరేకిస్తున్నాయి.
దక్షిణాదికి అన్యాయం చేస్తుందన్న భావనతో ఉన్న ఇక్కడ రాజకీయ పక్షాలు అన్నీ కేంద్ర ప్రభుత్వంపై పోరాటం చేయడానికి సిద్ధం అవుతున్నాయని వార్తలు వస్తున్నాయి. ఒకప్పుడు ఎన్ డీ ఏలో చక్రం తిప్పిన మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రస్తుత పరిస్థితుల్లో దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులతో భేటీ అయ్యే అవకాశాలు ఉన్నాయట. తెలంగాణ సీఎం కేసిఆర్, కేరళ సీఎం పినరయి విజయన్, తమిళనాడులో ప్రతిపక్ష నేత స్టాలిన్ తదితరులతో చంద్రబాబు సమావేశమై దక్షిణాది రాష్ట్రాలకు జరుగుతున్న అన్యాయంపై కేంద్ర ప్రభుత్వంపై పోరాటం చేయాలని కోరే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం కేంద్రంలో మోడీ స్ట్రాంగ్ గా ఉండటంతో ప్రాంతీయ పార్టీలు వేరువేరుగా కేంద్రంపై గట్టిగా పోరాడే పరిస్థితి కనబడటం లేదు. సంఘటిత శక్తిగా ఉంటేనే ఏదైనా సాధించుకునే అవకాశం ఉంది. ఈ కారణంగా వీరంతా సంఘటితం అయ్యే అవకాశాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరనే నానుడి ఉంది. దీంతో ఎప్పుడు ఏదైనా జరగవచ్చు. జరగకపోవచ్చు.