Chandra Babu : రాష్ట్రంలో పురపాలక సంఘ ఎన్నికలు నేపథ్యంలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి రాష్ట్రంలో మూడు రాజధానుల ప్రకటన చేసిన తొలి సింబల్ ఎన్నికలు కావడంతో కోస్తా ఆంధ్ర, ఉత్తరాంధ్ర, రాయలసీమలో పులపాలక ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయనేదాని పై సర్వత్రా ఉత్కంఠ నెలకొని ఉంది. ఈ ఎన్నికలను అధికార వైసీపీ, టీడీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. పంచాయతీ ఎన్నికల మాదిరిగానే పురపాలక ఎన్నికల్లోనూ మెజార్టీ స్థానాలు కైవశం చేసుకుని టీడీపీకి గట్టి షాక్ ఇవ్వాలన్న లక్ష్యంతో అధికార వైసీపీ ఉంది. ఈ క్రమంలో సర్వశక్తులు ఒడ్డుతోంది. ఇప్పటికే 15 నుండి 20 శాతం వైసీపీ ఏకగ్రీవం చేసుకున్నది. ఇక ఎన్నికలు జరుగుతున్న 60 శాతం పైగా సాధిస్తే వైసీపీ అనుకున్న ఫిగర్ 80 శాతం వచ్చినట్లే.
ప్రధానంగా విశాఖ, గుంటూరు, విజయవాడ నగర పాలక సంస్థలతో పాటు మేజర్ మున్సిపాలిటీల్లో పాగా వేసేందుకు టీడీపీ నేతలు, కార్యకర్తలను వైసీపీలో చేర్చుకుని కండువాలు కప్పేస్తున్నారు. ఇదే క్రమంలో రాజధాని అమరావతికి మద్దతు తెలియజేస్తున్న చంద్రబాబును ఉత్తరాంధ్ర, రాయలసీమ అభివృద్ధికి వ్యతిరేకిగా చిత్రీకరించే ప్రయత్నంతో ఆ ప్రాంతంలో సెంటిమెంట్ రాజేశారు. దీంతో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న చంద్రబాబుకు నిరసన సెగలు ప్రారంభం అయ్యాయి. ఓ పక్క టీడీపీ నాయకులు, కార్యకర్తలను లాగేసుకోవడం, మరో పక్క మూడు రాజధానులకు అనుకూలమైన వర్గాలతో నిరసనలు చేయించడంతో టీడీపీ నాయకులు ఖంగుతింటున్నారు.
మొన్న టీడీపీ అధినేత చంద్రబాబుకు కర్నూలు పర్యటనలో న్యాయవాదుల నిరసన సెగ తగిలింది. కర్నూలుకు హైకోర్టు రాకుండా అడ్డుకుంటున్నారంటూ న్యాయవాదులు గోబ్యాక్ నినాదాలు చేశారు. అదే మాదిరిగా నిన్న విశాఖలో కొందరు ఉత్తరాంధ్ర ద్రోహి చంద్రబాబు గో బ్యాక్ అంటూ ప్లకార్డులతో నిరసన తెలిపారు. అయితే ఇవన్నీ వైసీపీ చేయిస్తుందంటూ టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఏది ఎలా ఉన్న కీలకమైన విశాఖ, విజయవాడ, గుంటూరు నగరాల ప్రజల తీర్పు ఎలా ఉంటుంది అనే దానిపై సర్వత్రా ఆసక్తికర చర్చ జరుగుతోంది.