Chandrababu : ఏపీ మాజీ ముఖ్యమంత్రి ,ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు కేంద్రంగా జరుగుతున్న పరిణామాల విషయంలో సీఎం వైఎస్ జగన్ మోహన్ రాజకీయ ఎత్తుగడలను పలువురు ఆసక్తికరంగా చర్చిస్తున్నారు. అమరావతి రాజధాని భూసేకరణలో ఇన్సైడర్ ట్రేడింగ్ ఉదంతం ఇప్పుడు కలకలంగా మారింది. ఏపీ సీఐడీ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకి నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. దీని అనంతరం పరిణామాలే ఇప్పుడు చర్చకు దారి తీస్తున్నాయి.
Chandrababu చంద్రబాబు ఏం చేయనున్నారంటే….
అమరావతి అసైన్డ్ భూముల కేసుపై చంద్రబాబు కోర్టుకు వెళ్లనున్నారని సమాచారం. సిఐడి నమోదు చేసిన ఎఫ్ఐఆర్ నే తప్పు పడుతున్న పార్టీ పెద్దలు కోర్టుకు వెళ్లి స్టే తెచ్చే ప్రయత్నంలో ఉన్నారు. అసైన్డ్ భూముల కేసు కుట్రపూరిత కేసు గా భావిస్తున్న టీడీపీ ఈ విషయంలో విచారణకు హాజరు కాకూడదని నిర్ణయం తీసుకుంది. బాధితులే లేకుండా…కక్ష పూరితంగా కేసు పెట్టారు అని భావిస్తున్న టిడిపి….విచారణకు వెళ్లకూడదని నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఒ దఫా పార్టీ నేతలతో మాట్లాడిన చంద్రబాబు….మరోసారి న్యాయ నిపుణుల సలహాలను కూడా వారితో చర్చించారు. దీంతో చంద్రబాబు ఈ విషయంలో కోర్టును ఆశ్రయించబోతున్నారు .
నారాయణ ప్యాకప్ లెక్క ఏంటంటే…
అమరావతి భూముల విషయంలోనే నారాయణకు ఏపీ సీఐడీ నోటీసులు జారీ చేసింది. నోటీసుల్లో నారాయణను ఏ-2గా పేర్కొన్నారు. చంద్రబాబుపై నమోదు చేసిన సెక్షన్ల కింద నారాయణపై కూడా కేసులు నమోదు చేశారు. హైదరాబాద్ లోని ఆయన నివాసంలో నోటీసులను సీఐడీ అధికారులు అందించారు. అమరావతి అసైన్డ్ భూముల వ్యవహారంలో సీఐడీ నోటీసులు ఇచ్చింది. నారాయణ అందుబాటులో లేకపోవడంతో భార్య రమాదేవికి నోటీసులు అందజేశారు. ఈ నెల 22న విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. మొత్తంగా ఇటు బాబును అటు అమరావతి భూముల్లో క్రియాశీలంగా ఉన్న నారాయణను ఏకకాలంలో ఇరకాటంలో పడేయడం ద్వారా ఉక్కిరిబిక్కిరి చేయాలనే ఆలోచనతో అధికారపక్షం ఉందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.