Chandrababu: ప్రత్యేక హోదా ఏమై సంజీవనా, ప్రత్యేక హోదా ఇచ్చిన రాష్ట్రాల్లో ఏమి జరిగింది, ప్రత్యేక హోదా కంటే ప్యాకేజీ ముద్దు అని అధికారంలో ఉన్నప్పుడు ప్రత్యేక హోదా వదులుకొని ప్యాకేజీకి ఒప్పుకున్న చంద్రబాబు ఇప్పుడు కొత్త పల్లివి ఎత్తుకున్నారు. రాజకీయ పార్టీలు అధికారంలో ఉన్నప్పుడు ఒకలా, అధికారంలో లేనప్పుడు ఒకలా వ్యవహరించడం సహజమే. ఆ విషయంలో టీడీపీ గానీ వైసీపీగా గానీ బీజేపీ గానీ అన్ని ఒక తానులోకి ముక్కలే అనాల్సిందే. ప్రత్యేక హోదా విషయంలో గతంలో రాజ్యసభ వేదికగా గట్టిగా మాట్లాడిన నేటి ఉపరాష్ట్రపతి, నాటి బీజేపీ రాజ్యసభ సభ్యుడు వెంకయ్య నాయుడు నేడు ఆ విషయం గురించే కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడటం లేదు. నాడు ప్రత్యేక హోదా అవసరం లేదు ప్యాకేజీ చాలు అన్న తెలుగు దేశం ఇప్పుడు ప్రత్యేక హోదా అంటోంది. అప్పుడు 25 స్థానాలు ఇస్తే కేంద్ర ప్రభుత్వ మెడలు వంచి రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకువస్తామన్న వైసీపీ నేడు విజ్ఞప్తులకే పరిమితం అయ్యింది.
Chandrababu: ఎంపీలు రాజీనామా చేయాలి
తాజాగా ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు విషయంలో వైసీపీ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని టీడీపీ అధినేత చంద్రబాబు ఎండగట్టారు. ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయమని కేంద్ర ప్రభుత్వం ఇటీవల పార్లమెంట్ లో ప్రకటించిందని దీనిపై రాష్ట్ర ప్రభుత్వం, వైసీపీ ఎంపీలు ఏమి చేస్తున్నారని చంద్రబాబు ప్రశ్నించారు. హోదాపై ఇంకా ఎన్నాళ్లు ప్రజలను మభ్యపెడతారని చంద్రబాబు మండిపడ్డారు. దీనిపై వైసీపీ సమాధానం చెప్పాలన్నారు. ప్రత్యేక హోదా తీసుకువస్తామనీ, అలా చేయని పక్షంలో రాజీనామా చేస్తామని సీఎం జగన్ గతంలో చెప్పారని గుర్తు చేసిన చంద్రబాబు.. వైసీపీకి ఏమాతం చిత్తశుద్ది ఉన్నా ఆ పార్టీ ఎంపీలు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. తమ ఎంపీలు కూడా రాజీనామా చేస్తారని, అందరం కలిసి ప్రత్యేక హోదా కోసం పోరాడదామని అన్నారు. మాయ మాటలు, సన్నాయి నొక్కులు, డైవర్షన్లు వద్దని ఈ సవాల్ కు సిద్దమా అని చంద్రబాబు ప్రశ్నించారు.