Chandrababu : ఏపీ ప్రతిపక్ష నేత, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు రేణిగుంట విమానాశ్రయంలో చేసిన ఆందోళనతో దాదాపు రోజంతా ఉత్కంఠ నెలకొన్న సంగతి తెలిసిందే. మున్సిపల్ ఎన్నికల్లో అవకతవకల్ని, అక్రమాలు జరిగాయని పేర్కొంటూ చిత్తూరు,
తిరుపతిలో ధర్నాల్లో పాల్గొనాలని చంద్రబాబు నిర్ణయించుకున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆయన హైదరాబాద్ నుంచి రేణిగుంట చేరుకున్నారు. ఆ క్షణం నుంచి ఎయిర్పోర్ట్ లోపల-బయట ఉద్రిక్త పరిస్థితులు కొనసాగాయి. ఎట్టకేలకు రాత్రి సర్దుమణిగాయి. అయితే ఈ ఎపిసోడ్పై అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీ ఒకరు హర్ట్ అయ్యారు.
Chandrababu ఆ ఎంపీగారు ఫీలయ్యారు…
రేణిగుంటలో ప్రతిపక్షనేత చంద్రబాబు ఆందోళన పర్వంపై నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఏపీలో వైసీపీ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని కాలరాస్తోందని విమర్శించారు. రేణిగుంటలో ప్రతిపక్షనేత చంద్రబాబును పోలీసులు అడ్డుకోవడం దారుణం అని మండిపడ్డారు. నియంతృత్వంగా ఉండాలని వైసీపీ ప్రభుత్వం అనుకుంటోందని ధ్వజమెత్తారు. ఏపీలో ప్రతిపక్ష నేతకే రక్షణ లేకుండా పోయిందని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు ఆవేదన వ్యక్తం చేశారు.
మండిపడ్డ మంత్రి ..
అయితే, చంద్రబాబు నిరసన కేవలం రాజకీయ డ్రామా అంటూ మంత్రి పెద్దిరెడ్డి రాంచంద్రారెడ్డి మండిపడ్డారు. ఎన్నికల కోడ్ ఉందని తెలిసే చంద్రబాబు పర్యటనకు సిద్ధమయ్యారని మంత్రి పెద్దిరెడ్డి విమర్శించారు. చంద్రబాబును ప్రజలు పట్టించుకోవడం లేదని ఎద్దేవా చేసిన పెద్దిరెడ్డి.. శాంతిభద్రతలకు విఘాతం కలిగించాలనే చంద్రబాబు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. ఆనాడు విశాఖపట్నం విమానాశ్రయంలో వైఎస్ జగన్ను చంద్రబాబు అడ్డుకున్నారని గుర్తుచేసిన పెద్దిరెడ్డి.. కానీ, చంద్రబాబును ఇప్పుడు ఎవ్వరూ ఇబ్బంది పెట్టలేదన్నారు.