ఏపిలో చంద్రబాబు నేతృత్వంలోని తెలుగుదేశం పార్టీ పరిస్థితి నానాటికీ తీసికట్టుగానే ఉంది. గడచిన ఎన్నికల్లో గతంలో ఎన్నడూ లేని విధంగా టీడీపీ ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. కేవలం 23 అసెంబ్లీ, మూడు పార్లమెంట్ స్థానాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. టీడీపీ తరపున గెలిచిన 23 మందిలో నలుగురు ఎమ్మెల్యేలు వైసీపీ గొడుగు కింద చేరిపోయారు. మరో వైపు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సహకరించకపోయినా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి అప్పులు చేసి మరీ సంక్షేమ రథాన్ని పరుగులు పెట్టిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో గత ఎన్నికల నాటి కంటే టీడీపీ పరిస్థితి రాష్ట్రంలో మెరుగుపడిందా లేదా అన్నది తెలుసుకోవాలంటే స్థానిక సంస్థల ఎన్నికలు ఒక గీటు రాయిగా చూడవచ్చు. అయితే ఈ ఎన్నికలు ఎలా జరుగుతాయో అందరికీ తెలుసు. సాధారణంగా అధికారంలో ఉన్న పార్టీ వైపే ఎక్కువగా మొగ్గు ఉండేలా చూసుకుంటారు. ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే పంచాయతీ ఎన్నికలలో పార్టీ సింబల్ ఉండదు కాబట్టి విజయం సాధించిన ఎవరికి వారు స్థానిక పరిస్థితులను బట్టి పార్టీ కండువా కప్పేసుకుంటారు.
మరో పక్క త్వరలో తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నిక విషయానికి వస్తే అథికార వైసీపీ తామే పోటీ అని బీజెపి – జనసేన గట్టిగా దూసుకువస్తోంది. తెలంగాణలో దుబ్బాక ఉప ఎన్నిక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించిన బీజెపీ అదే దూకుడును ఇక్కడ తిరుపతి ఎన్నికల్లోనూ కనబర్చాలని చూస్తోంది. అధికార పార్టీకి గట్టిపోటీ ఇవ్వడానికి ఈ కూటమి సిద్ధమవుతోంది. ఈ పరిస్థితులలో రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ పుంజుకోవాలంటే మళ్లీ చంద్రబాబు నాయుడు నడుం బిగించాలంటున్నారు ఆ పార్టీ శ్రేణులు. చంద్రబాబే ఏదో ఒకటి చేయాలంటున్నారుట తెలుగుతమ్ముళ్లు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పార్టీ బలోపేతానికి చంద్రబాబు 2012 అక్టోబర్ 2న వస్తున్నా మీ కోసం అంటూ చేసిన పాదయాత్ర మాదిరిగానే ఇప్పుడు కూడా విభజిత ఆంధ్రప్రదేశ్ లో పాదయాత్రకు చంద్రబాబు సిద్దపడుతున్నారుట. పాదయాత్ర నిర్వహిస్తే పార్టీ శ్రేణుల్లో ఊపు, జనాల్లో సింపతీ వస్తుందని బాబు అనుకుంటున్నారుట. 77 ఏళ్ల వయసులో బాబు జనంలోకి పాదయాత్ర ద్వారా వస్తే తప్పకుండా జనాలు బ్రహ్మరథం పడతారని తెలుగు తమ్ముళ్లు ఆశ. వయసును సైతం లెక్కచేయకుండా చంద్రబాబు ప్రజల్లోకి వస్తే సానుభూమి వర్క్ అవుట్ అవుతుందని కూడా టాక్. పాదయాత్ర ద్వారా ప్రజా సమస్యలు తెలుసుకుంటే పార్టీ ఇమేజ్ పెరుగుతుందా లేదా అన్న చర్చ పార్టీ లో అంతర్గతంగా చర్చ జరుగుతుందంటున్నారు. అయితే చంద్రబాబు పాదయాత్ర చేయడానికి జగన్ ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోతే ప్రధాన మంత్రి మోడీ ద్వారా అయినా గ్రీన్ సిగ్నల్ ఇప్పించుకోవాలనుకుంటున్నారుట. ఒక వేళ డేర్ చేసి చంద్రబాబు ఈ వయసులో పాదయాత్ర చేస్తే అది పెద్ద సాహసమే అవుతుందంటున్నారు. అయితే వైసీపీకి ప్రత్యామ్నాయంగా రాష్ట్రంలో ఎదుగాలనుకుంటున్న బీజెపీ – జనసేన కూటమి ఈ పరిస్థితులను చూస్తూ ఎందుకు ఉంటాయి. వారు ఏదో ఒక కార్యక్రమం పేరుతో జనాల్లోకి వెళ్లి అవకాశం ఉందని అంటున్నారు. చూడాలి రాష్ట్రంలో పరిస్థితులు ఏ విధంగా మారతాయో.