Chandrababu Jagan: కొన్నేళ్లుగా తెలుగు సినిమా ఖ్యాతి ఎల్లలు దాటుతోంది. చిన్న సినిమాలు హిట్టవుతుంటే.. యూట్యూబ్ లో తెలుగు డబ్బింగ్ సినిమాలకు క్రేజ్ పెరుగుతోంది. పాన్ ఇండియా స్థాయిలో తెలుగు సినిమాలు తెరకెక్కుతున్నాయి. దేశంలోనే ఏడాదికి ఎక్కువ సినిమాలు నిర్మించే పరిశ్రమగా టాలీవుడ్ కి పేరుంది. ప్రస్తుతం భారతీయ సినిమా తెలుగు సినిమా వైపు చూస్తోంది. ఇలాంటి పరిస్థితిల్లో కూడా టాలీవుడ్ ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ధియేటర్ల సమస్య, ఓటీటీలు, చిన్న సినిమాలకు షోలు, కరోనా.. ఇలా చాలానే ఉన్నాయి. అయితే.. ఉమ్మడి ఏపీ నుంచి తెలుగు సినిమాకు ప్రభుత్వం నుంచి మంచి ప్రోత్సాహమే ఉన్నా.. రెండు రాష్ట్రాలయ్యాక పరిస్థితులు మారాయి. తెలంగాణలో లేని సమస్యలు ఏపీలో ఎదురవుతున్నాయి.
వైసీపీ ప్రభుత్వం ఇలా..
ప్రధానంగా టికెట్ రేట్ల విషయంలో తెలంగాణ రేట్లు పెంచి సమస్యలు తెచ్చుకోకుండా ఉంది. కానీ.. ఏపీలో ప్రజలకు వినోదం అందుబాటులో ఉంచాలని టికెట్ల రేట్లపై ప్రభుత్వం ఓ జీవో తీసుకొచ్చింది. సవరించిన రేట్లతో సినిమాలు వేయలేని పరిస్థితి నెలకొనడంతో ప్రభుత్వంతో పరిశ్రమ వర్గాలు కొన్నాళ్లుగా చర్చలు జరిపాయి. దీనికి త్వరలో పరిష్కారం కూడా రానుంది. అయితే.. ఏపీలో జరుగుతున్న పరిణామాలతో వైసీపీ ప్రభుత్వం సినిమాకు కావాలనే సమస్యలు సృష్టించిందనే అపవాదు తెచ్చుకుంది. రాజకీయంగా కూడా చర్చనీయాంశమైంది. సినిమా వారిని పిలిచి అవమానాలకు గురి చేస్తోందని చంద్రబాబు అంటుంటే.. అప్పట్లో చంద్రబాబే సినిమా వాళ్లను అవమానించారని మంత్రి పేర్ని నాని ఆరోపిస్తున్నారు.
టీడీపీ హయాంలో అలా..
గుణశేఖర్.. రుద్రమదేవి సినిమాకు టీడీపీ ప్రభుత్వం టాక్స్ మినహాయింపు ఇవ్వలేదు. తెలంగాణలో ఇచ్చారు. బాలకృష్ణ.. గౌతమీపుత్ర శాతకర్ణికి రెండు రాష్ట్రాల్లోనూ మినహాయింపు ఇచ్చారు. చిరంజీవి.. ఖైదీ నెంబర్ 150 ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు విజయవాడ, గుంటూరులో పర్మిషన్ ఇవ్వకుండా చేశారని చంద్రబాబుపై ఆరోపణ ఉంది. మహానటి సినిమాకు నిర్మాత అశ్వనీదత్ అడక్కుండానే టాక్స్ మినహాయింపు ఇస్తానని చంద్రబాబు అనౌన్స్ చేయడం.. నిర్మాత వద్దనడం చర్చనీయాంశమైంది. ఇవన్నీ చంద్రబాబు వేసుకున్న అపవాదులు. తెలంగాణలో ఇప్పటివరకూ ఇటువంటి పంచాయతీలు జరగలేదు. కానీ.. ఏపీలో అప్పుడు చంద్రబాబు, ఇప్పుడు జగన్ తీసుకున్న.. తీసుకుంటున్న పలు నిర్ణయాలకు వ్యక్తిగతంగా విమర్శలపాలవుతున్నారు. వివాదరహితంగా తెలుగు సినిమా వెలుగులు ప్రభుత్వాల ప్రోత్సాహంతో మరింత దేదీప్యమానం కావాల్సి ఉంది..!
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?