Chandra Babu: 40 ఇయర్స్ ఇండస్ట్రీ నేత ఎప్పుడూ చూడలేని గడ్డు పరిస్థితిని చూస్తున్నారు. తన రాజకీయ అనుభవం ఉన్నంత వయసు లేని రాజకీయ ప్రత్యర్ధిని ధీటుగా ఎదుర్కోలేకపోతున్నారు. తన రాజకీయ జీవితంలో ఏంతో మంది గట్టి నాయకుల ముందు సమర్ధవంతంగా రాజకీయాలు నడిపి రాష్ట్ర, దేశ రాజకీయాల్లో చక్రం తిప్పారు. కానీ నేడు సహచరుడి కుమారుడి రాజకీయ ఎత్తుల ముందు పరాజయం పాలవుతూ వస్తున్నారు. అందుకు 2019 సార్వత్రిక ఎన్నికలు, ఆ తరువాత జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలే నిదర్శనంగా నిలుస్తున్నాయి. ఇకపై ప్రత్యర్ధి పార్టీని ఎదుర్కోవాలంటే వారు 2019 ఎన్నికల్లో అనుసరించిన పొలిటికల్ స్ట్రాటజీలనే అనుసరించడానికి సిద్ధం అవుతున్నట్లుగా ఉన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. పార్టీ పరంగా 2024 ఎన్నికల వ్యూహం కోసం చంద్రబాబు ఓ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. చంద్రబాబు తీసుకున్న నిర్ణయం ఆ పార్టీ నేతల్లో గుబులు పుట్టిస్తోంది.
Chandra Babu: పీకే స్ట్రాటజీతో జగన్ ముందుకు
2019 ఎన్నికల్లో నాటి ప్రతిపక్ష నేతగా ఉన్న వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహనరెడ్డికి ఎన్నికల వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్ (పీకే) వ్యవహరించారు. పీకే స్ట్రాటజీ ఆధారంగా అభ్యర్ధుల ఎంపిక చేశారు జగన్మోహనరెడ్డి. పీకే టీమ్ నియోజకవర్గాల్లో సర్వే జరిపిి గెలుపు గుర్రాలు ఎవరో గుర్తించి వారి పేర్లు సిఫార్సు చేసినట్లుగా సమాచారం. పాదయాత్రలోనూ జగన్మోహనరెడ్డి పీకే స్ట్రాటజీతోనే ముందుకు సాగారు వైఎస్ జగన్. దాంతో 151 అసెంబ్లీ స్థానాలు, 22 లోక్ సభ స్థానాలు గెలుచుకుని ముఖ్యమంత్రి పీఠం ఏక్కారు వైఎస్ జగన్. ఆ ఎన్నికల్లో టీడీపీ అధినేత చంద్రబాబుకు పలువురు పార్టీ సీనియర్ లు కొంత మంది ఎమ్మెల్యేలపై తీవ్ర అసంతృప్తి ఉంది వాళ్లకు సీట్లు ఇవ్వవద్దని చెప్పినా ఆ మాటలను పెడ చెవిన పెట్టారుట. 1999 నుండి 2019 ఎన్నికల వరకూ టీడీపీ అభ్యర్ధుల ఎంపికను చంద్రబాబే చేశారు. పేరుకు పార్టీలో స్క్రీనింగ్ కమిటీ అనేది ఒకటి ఉన్నా అవి నామమాత్రమే. చంద్రబాబు అనుకున్న వాళ్లకే టికెట్లు ఇచ్చారనేది అందరికీ తెలిసిందే.
చంద్రబాబుకు రాబిన్ శర్మ వ్యూహలు
అయితే 2024 ఎన్నికలు తెలుగుదేశం పార్టీకి చావో రేవో తేల్చుకోవాల్సిన పరిస్థితి. ఈ పరిస్థితిలో గతంలో తన పాత రాజకీయ పద్ధతుల్లో ముందుకు వెళితే లాభం లేదని గ్రహించినట్లు ఉన్నారు. అందుకే తనకు నచ్చిన నేతల కంటే ప్రజలు ఎవరు కోరుకుంటున్నారో వారినే నియోజకవర్గాలకు అభ్యర్ధులుగా ఎంపిక చేయాలని చంద్రబాబు ఆలోచనకు వచ్చారుట. ఈ సారి అందులో రాజీపడే పరిస్థితి లేదట. అందు కోసం ఇప్పటి నుండి రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గాల్లో సర్వేలు చేస్తున్నారుట. ఇప్పటికే గతంలో పీకే టీమ్ లో పని చేసిన ఎన్నికల వ్యూహ కర్త రాబిన్ శర్మ టీడీపీకి పని చేస్తున్నారు. రాబిన్ శర్మ నేతృత్వంలో ఒక సర్వే కొనసాగుతుండగా, మరో రెండు రెప్యుటేషన్ కల్గిన సంస్థలకు కూడా సర్వే బాధ్యతలను చంద్రబాబు అప్పగించారని వార్తలు వినబడుతున్నాయి. ఎన్నికల నాటికి మూడు దఫాలు సర్వేలు చేసి వాళ్లు చంద్రబాబుకు అందించనున్నారుట. ఈ సర్వే నివేదికల ప్రకారమే టీడీపీలో అభ్యర్ధుల ఎంపిక జరగనుందని సమాచారం. ఈ పరిణామం ప్రస్తుతం నియోజకవర్గాల్లో ఇన్ చార్జిల్లో గుబులు రేకెత్తిస్తోందని అంటున్నారు.