Chandrababu: ఏపీ ప్రతిపక్ష నేత , తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు మరోమారు కీలక విమర్శ ఎదుర్కునే అవకాశం కనిపిస్తోంది. ఏపీలో ఓ వైపు కరోనా కల్లోలం కొనసాగుతుండగా మరోవైపు రాజకీయ పరిణామాలు సైతం హీటెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఇలాంటి తరుణంలోనే ఏపీ బడ్జెట్ సమావేశాలు తెరమీదకు వచ్చాయి. 2021-22 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ ప్రవేశపెట్టడానికి ఏపీ ప్రభుత్వం సిద్ధమైంది. ఒక్కరోజుకే బడ్జెట్ సమావేశాలను పరిమితం చేయాలని వైసీపీ సర్కార్ నిర్ణయించింది. బీఏసీ సమావేశంలో ఇదే నిర్ణయాన్ని తీసుకోనుంది. ప్రధాన ప్రతిపక్షం టీడీపీ బడ్జెట్ సమావేశాలను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించడంతో.. బడ్జెట్ ఆమోదం దాదాపు ఏ చర్చ లేకుండానే ముగియనుంది. అయితే, ఇక్కడే చంద్రబాబు పై కొత్త టాపిక్ ప్రచారంలోకి వస్తోంది.
టీడీపీ లెక్క ఇది
నేడు జరగబోయే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ బహిష్కరిస్తున్నట్లు ప్రకటించడంతో.. రాజకీయ రచ్చ మొదలైంది. ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ పోను మిగిలిన తొమ్మిది నెలలకు సంబధించిన పూర్తి బడ్జెట్ సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్లు టీడీపీ ప్రకటించడం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. రెండేళ్ల తన పాలనలో కేవలం 38 రోజులే శాసససభ సమావేశాలు నిర్వహించడం పట్ల టీడీపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ప్రభుత్వానికి సమాంతరంగా ప్రజా సమస్యలనే అజెండాగా తీసుకొని మాక్ అసెంబ్లీ నిర్వహించే ఆలోచనలో ప్రతిపక్ష పార్టీ ఉంది. జూమ్ లో మాక్ అసెంబ్లీ నిర్వహించనున్నారు.
వైసీపీ వాదన ఇది…
టీడీపీ నిర్ణయంపై ఏపీ సీఎం వైఎస్ జగన్ నమ్మినబంటు, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కరోనా సంక్షోభంలో బడ్జెట్కు ఆమోదం తెలిపేందుకే తప్పనిసరిగా అసెంబ్లీ పెట్టాల్సి వస్తోందని క్లారిటీ ఇచ్చారు. పరిస్థితులు బాగోలేవు కాబట్టే.. ఒక్కరోజు అసెంబ్లీ పెట్టామని పేర్కొంటూ టీడీపీ సభ్యులు వస్తే వాళ్లకి గౌరవం ఉంటుందని.. లేకపోతే చేసేందేమీ లేదంటూ వ్యాఖ్యానించారు. టీడీపీ నేతలకు జూమ్ మీటింగ్లు అంటే ముచ్చట అంటూ పంచ్లు వేశారు.