Chandrababu: టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాపై ఇటీవల రెక్కీ జరిగిన అంశం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం అయిన విషయం తెలిసిందే. రాధా సంచలన వ్యాఖ్యల నేపథ్యంలో జగన్ సర్కార్ వెంటనే స్పందించి విజిలెన్స్ విచారణకు ఆదేశిస్తూ 2 ప్లస్ 2 గన్ మెన్ల భద్రతకు చర్యలు చేపట్టింది. అయితే గన్ మెన్ల భద్రతను రాధా తిరస్కరించారు. రాధా చేసిన సంచలన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలాన్ని రేపాయి. దీనిపై అనేక రకాల ఊహాగానాలు సాగాయి. ఆ పరిణామ క్రమంలోనే రాధాకు టీడీపీ అధినేత చంద్రబాబు ఫోన్ చేసి పరామర్శించారు. త్వరలో నేరుగా కలుస్తానని, పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. నేడు రాధా నివాసానికి వెళ్లిన చంద్రబాబు ఆయనను పరామర్శించి రెక్కీ జరిగిన విషయంపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. వంగవీటి రాధాతో పాటు ఆయన తల్లి చెన్నుపాటి రత్నకుమారితోనూ చంద్రబాబు మాట్లాడారు. తన నివాసానికి వచ్చిన చంద్రబాబుకు రాధా సాదరంగా ఆహ్వానం పలికారు.
రాధాతో భేటీ అనంతరం చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. రాధా విషయంలో ప్రభుత్వం చూసిచూడనట్లు వ్యవహరించిందని అన్నారు. సీసీ టీడీ పుటేజీ ద్వారా ఎవరు రెక్కీ నిర్వహించారో తెలుసుకోవచ్చని అన్నారు చంద్రబాబు. ఫిర్యాదు చేయలేదన్న సాకు చెప్పడం కరెక్ట్ కాదనీ, తాను డీజీపీకి లేఖ రాశాననీ, రాధా మీడియాతో విషయాలను చెప్పారనీ, వాటిని బేస్ చేసుకుని దర్యాప్తు ప్రారంభించి దోషులను పట్టుకునే అవకాశం ఉన్నా వారం రోజులైనా ఇంత వరకూ ఏమి తేల్చలేదని విమర్శించారు. భద్రత కల్పించి చేతులు దులుపుకుందాం అని అనుకున్నారని విమర్శించారు. ఈ ఘటనను ప్రభుత్వం తీవ్రంగా పరిగణించి దోషులు ఎవరో తేల్చాలని డిమాండ్ చేశారు. రెక్కీ చేసిన మాట వాస్తవమని, సీసీ కెమెరాల్లో విజువల్స్ ఉన్నాయా లేదా అని చంద్రబాబు ప్రశ్నించారు.