YS Jagan: ఏపీ ముఖ్యమంత్రి , వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన చాన్స్ ను తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు , ఏపీ ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు వదులుకున్నారా? ఓ గేమ్ ప్లాన్ కు ఆయన తెర తీస్తే…ఇంకో ఊహించని చాన్స్ మిస్సయిందా? అంటే అవుననే సమాధానం వస్తోంది తాజాగా జరిగిన అసెంబ్లీ సమావేశాల సందర్భంగా చోటుచేసుకున్న ఘటనలను చూస్తుంటే.
ఏపీ బడ్జెట్ సమావేశాల్లోనే…
బడ్జెట్ సమావేశాల సందర్భంగా విశాఖ స్టీల్ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఏపీ అసెంబ్లీలో తీర్మానం చేశారు. పరిశ్రమలశాఖ మంత్రి మేకపాటి గౌతమ్రెడ్డి ప్రవేశపెట్టిన ఈ తీర్మానం ఆమోదం పొందింది. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. విశాఖ స్టీల్ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇప్పటికే ప్రధానమంత్రి నరేంద్రమోదీకి లేఖ రాసినట్లు తెలిపారు. ప్రేవేటీకరణ కాకుండా సీఎం తన లేఖలో అయిదు ప్రత్యామ్నాయాలు సూచించారని పేర్కొన్నారు. విశాఖ స్టీల్ప్లాంట్కు క్యాప్టివ్ మైన్స్ కేటాయించాలని, స్టీల్ప్లాంట్ నష్టాల నుంచి బయట పడేందుకు అన్ని అవకాశాలు ఉన్నాయని తెలిపారు. విశాఖ ఉక్కు తెలుగువారి ఆత్మగౌరవంతో ముడిపడి ఉందని మరోసారి గుర్తుచేశారు. విశాఖ ఉక్కు.. ఆంధ్రుల హక్కు అని ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ అన్నారు. 32 మంది ప్రాణాల బలిదానం ద్వారా స్టీల్ప్లాంట్ ఏర్పాటు అయ్యిందని, స్టీల్ప్లాంట్కు క్యాప్టివ్ మైన్స్ కేంద్రం కేటాయించాలని డిమాండ్ చేశారు. స్టీల్ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్రం పునరాలోచించాలని కోరారు.
మంచి చాన్స్ మిస్సయింది బాబు
విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరణ చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా గత కొన్ని రోజులుగా తీవ్ర ఆందోళనలు జరుగున్న విషయం తెలిసిందే. అయితే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేస్తామని ఫిబ్రవరిలోనే ఉక్కు పరిరక్షణ సంఘం ప్రతినిధులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. తాజాగా అసెంబ్లీ సమావేశాల సమయంలో ఈ మేరకు ప్రభుత్వం తీర్మానం చేసింది. అయితే, సమావేశాలకు గైర్హాజరు అవడం ద్వారా చంద్రబాబు ఆంధ్రుల ఆత్మగౌరవానికి సంబంధించిన అంశంలో టీడీపీ పాత్ర లేకుండా పోయిందని అంటున్నారు.