TDP: టీడీపీలో అప్పుడే సీట్ల అంతర్యుద్ధం మొదలైందా..? అంటే అవుననే సమాధానమే వస్తోంది. టికెట్ల విషయంలో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుపై పార్టీ వర్గాలు ఒత్తిడి తెస్తున్నాయని సమాచారం. ఇదంతా.. 2024 ఎన్నికల్లో ఇచ్చే సీట్ల పంచాయతీ కావడం విశేషం. ఎన్నికలకు ఇంకా దాదాపు రెండున్నరేళ్లు ఉండగానే.. అప్పుడే పార్టీలో లుకలుకలు బయటపడటం.. టీడీపీకి మూలిగే నక్కపై తాటిపండు పడినట్టే అని చెప్పాలి. ఇటువంటి పంచాయతీలు చంద్రబాబుకు కూడా తలనొప్పే అని చెప్పాలి. జగన్ బలాన్ని ధీటుగా ఎదుర్కోవడానికి వ్యూహాలు రచించాలా.. పార్టీ నాయకులు, కార్యకర్తలను సముదాయించాలో తెలీని పరిస్థితి ఇప్పుడు టీడీపీలో నెలకొందని చెప్పాలి.
వీళ్లతో ఇబ్బందేనట..
అధికార పార్టీలో ఉండాల్సిన సీట్ల గొడవ.. ప్రతిపక్ష పార్టీ (TDP) టీడీపీకి ఉండటం గమనార్హం. పత్తిపాటి పుల్లారావు, కోడెల శివరామ్, సోమిరెడ్డి.. గురించి చంద్రబాబుకు కార్యకర్తల నుంచి విన్నపాలు వెళ్తున్నాయని సమాచారం. మంత్రిగా ఐదేళ్లు పని చేసినా.. తమను పట్టించుకోలేదని, ఇబ్బందులకు గురి చేశారాని, ప్రతిపక్షంలో ఉండగా ఈ రెండున్నరేళ్లు పార్టీకి దూరంగా ఉండి ఇప్పుడు మళ్లీ టికెట్ ఆశించడమేంటని ప్రశ్నిస్తున్నారు నాయకులు. కోడెల శివప్రసాద్ స్పీకర్ గా ఉన్నప్పుడు తనయుడు శివరామ్ తీరు, స్థానికంగా ఉన్న వ్యతిరేకత తోడై.. ఆయనకు టికెట్ ఇవ్వొద్దని కాస్త గట్టిగానే చెప్తున్నారని సమాచారం. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వరుసగా ఓడిపోతున్నా.. మంత్రి పదవి ఇవ్వడంపై అప్పట్లోనే వ్యతిరేకత ఉంది. ఇక ఆయన గెలిచే పరిస్థితి లేదని.. కొత్తవారికి టికెట్ ఇవ్వాలని కార్యకర్తలు అంటున్నారట.
వింటారా.. తాను అనుకున్నదే చేస్తారా..
2019 ఎన్నికల్లో (TDP) టీడీపీ ఓటమికి చంద్రబాబు సొంత నిర్ణయాలు, పార్టీని, కార్యకర్తలను పట్టించుకోకపోవడం చాలా పెద్ద కారణాలు. ఓటమి తర్వాత చంద్రబాబు వీటిని ఒప్పుకున్నారు కూడా. ఇటువంటి సమయంలో.. ప్రతిపక్షంలో ఉండగా కార్యకర్తలు, పార్టీ ముఖ్యం అని చెప్తున్న చంద్రబాబు.. సీట్ల సర్దుబాట్ల విషయంలో వారి మాట వినక తప్పని పరిస్థితి. పార్టీ కోసం కష్టపడేవారు, ఢీ అంటే ఢీ అనే వారికే సీట్లు ఇస్తానంటున్న చంద్రబాబు.. ఆ మాట నిలబెట్టుకోవాలంటే.. కార్యకర్తలు, స్థానిక నాయకుల అభీష్టం మేరకే నడుకోవాల్సి ఉంటుంది. మరి.. చంద్రబాబు ఆ మాట మీద ఉంటారా..? ఎప్పటిలా.. అందరూ చెప్పింది విని.. తాను చేయాలనుకున్నదే చేస్తారా..? అనేది చూడాలి.