Chandrababu: తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఎంతో మంది మహామహా నేతలకు ఎదురు నిలిచి పోరాటం చేసిన టీడీపీ అధినేత చంద్రబాబు.. వైఎస్ జగన్మోహనరెడ్డి అధికారంలోకి వచ్చిన రాజకీయంగా తీవ్ర గడ్డుపరిస్థితినే ఎదుర్కొంటున్నారు. కొందరు సీనియర్లు పార్టీని వదిలివెళ్లిపోవడం, కొందరు అధికార పార్టీకి భయపడి సైలెంట్ కావడం, కొందరు కోవర్టులుగా మారడం, అధికార పార్టీ నేతలతో కలిసి వ్యాపారాలు చేస్తూ పబ్బం గడుపుకోవడం చూస్తూనే ఉన్నారు. ఈ కారణంగానే స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ టీడీపీ ఘోర ఓటమిని చవి చూసింది. చివరకు చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పం మున్సిపాలిటీలోనూ వైసీపీ దెబ్బేసింది. చేతుల కాలిన తరువాత ఆకులు పట్టుకున్న చందంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటమి తరువాత చంద్రబాబు సమీక్షలు జరిపారు.
Read More: TDP Congress : టీడీపీ యూటర్న్..! ఒంటరిగానే పోటీ..!?
Chandrababu: అఖిలపక్షంగా ఏర్పడాలని
ప్రభుత్వ విధానాలపై టీడీపీ పోరాడలేకపోతుంది అన్న మాటలు వినబడుతున్నాయి. అయితే ఇప్పుడు చంద్రబాబుకు కొత్త ఆలోచన వచ్చింది అంటున్నారు. ఇటీవల తమ డిమాండ్ల సాధన కోసం ఉద్యోగ సంఘాలు అన్నీ కలిసి పీఆర్సీ సాధన సమితిగా ఏర్పడి ఉద్యమం చేయడంతో చలో విజయవాడ సక్సెస్ అయ్యింది. దీంతో ప్రభుత్వం దిగివచ్చి వారితో చర్చలు జరిపి డిమాండ్ల పరిష్కారానికి చొరవ చూపింది. చంద్రబాబు కూడా ఇదే తరహాలో ప్రభుత్వ విధానాలపై పోరాటం చేయాలని భావిస్తున్నారుట. వివిధ రాజకీయ పక్షాలతో ప్రస్తుతం పొత్తుల ప్రసక్తి లేకుండా ప్రభుత్వంపై ఉద్యమాలు చేసేందుకు గానూ అఖిలపక్షంగా ఏర్పడాలని నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ కేవలం టీడీపీ మాత్రమే కాకుండా తమతో కలిసి వచ్చే అన్ని పార్టీలతో కలిసి ఉమ్మడి కార్యాచరణను రూపొందించాలని భావిస్తున్నారుట.
ఉమ్మడి కార్యచరణపై
ప్రస్తుతం రాష్ట్రం సంక్షేమ పథకాలు అమలు తప్ప అభివృద్ధి లేదు. అనేక సమస్యలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకతను పెంచేందుకు భారీ స్థాయిలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహించేందుకు వైసీపీ వ్యతిరేక పార్టీలన్నింటినీ కలుపుకుపోవాలని ప్లాన్ చేస్తున్నారుట. ఉమ్మడి కార్యచరణపై బీజేపీ, జనసేన, వామపక్షాలు, ప్రజా సంఘాలతో చర్చలు జరిపేందుకు చంద్రబాబు సీనియర్ నేతలకు బాధ్యతలు అప్పగించారని అంటున్నారు. ఇది కార్యరూపం దాలుస్తుందో లేదో వేచి చూడాలి.