Chandrababu: ప్రతిపక్షంలో ఉన్న పార్టీ ప్రభుత్వంపై ఎప్పుడూ విమర్శలు చేయడమే కాదు.. ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకురావాలి.. తదనుగుణంగా ప్రజల్లో గెలవాలి.. గెలిచి నిలవాలి. ఏపీలో ప్రతిపక్ష టీడీపీ ఈ పద్ధతుల్ని ఎంతగా పాటిస్తోందనేదే ప్రశ్నగా మారింది. 2019లో ఓటమి అనంతరం పార్టీ బాగా కుంగిపోయింది. గెలిచిన 23 మందిలో కొందరు పార్టీ మారిపోయారు. మరికొందరు అవకాశం కోసం చూస్తున్నారు. ఇంకొందరు పార్టీలో ఉన్నారో లేరో పార్టీకే తెలీదు.. ఈ పరిస్థితుల్లో పార్టీని గాడిలో పెట్టడం చంద్రబాబుకు సవాల్ గానే మారింది. సమస్య కనపడితే ప్రభుత్వాన్ని విమర్శించడమే కానీ.. ప్రజల్లోకి వెళ్తున్నది తక్కువే అని చెప్పాలి. ఊపిరి సలపని సీఎం జగన్ వ్యూహాలకు ఉక్కిరిబిక్కిరి అవుతున్న టీడీపీ బలపడటం అనే మాటే మరచిపోయింది.
యువశక్తి కావాలి..
మరో రెండేళ్లలో ఎన్నికలు రానున్నాయి. పార్టీలో కొత్త నాయకత్వం రావాలి. కానీ.. టీడీపీలో ఆ పరిస్థితే కనిపించడం లేదన్నది కొందరి మాట. చంద్రబాబు ప్రతిసారీ పార్టీలో యువ రక్తాన్ని నింపుతామంటారు. కానీ.. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పే ఈ మాట అధికారంలోకి వస్తే మాత్రం మరచిపోతారనే అపవాదు మూటగట్టుకున్నారు. ప్రజల్లోకి వెళ్తున్నారు.. ఉద్యమాలు చేస్తున్నారు కానీ.. సమస్యలపై సుదీర్ఘ పోరాటాలు లేవని చెప్పాలి. అమరావతి ఉద్యమంలో రైతులు పోరాడుతున్నారు. రాజధాని కోసం అధికారంలో ఉన్నప్పుడు భూములు సేకరించిన టీడీపీ ఇప్పుడు.. రైతుల ఉద్యమంలో 500, 1000 రోజులు సందర్భంగానో.. ఏడాది, రెండేళ్లయిన సందర్భంగానో మాత్రమే స్పందిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా ఉద్యమంగా మార్చలేకపోయిందనేది వాస్తవం.
లోకేశ్ మెప్పించాలి..
భవిష్యత్ నాయకత్వంపై కూడా ఆ పార్టీలోనే కాదు.. ప్రజల్లో కూడా చర్చ జరుగుతోందనే చెప్పాలి. పార్టీలో లోకేశ్ హవా పెంచుకోవట్లేదనే విమర్శ కూడా ఉంది. యువ నాయకుడిగా ప్రజల్లో నిలిచింది తక్కువే అనే చెప్పాలి. ప్రతిపక్షంలో ఉండగా జగన్ ఎప్పుడో ఓసారి కనిపించినా తన హవా చాటేవారు. ఎన్నికలకు దాదాపు రెండేళ్ల ముందు నుంచీ పాదయాత్ర పేరుతో రాష్ట్రం మొత్తం తిరిగి ప్రజల మధ్యే ఉన్నారు. ఆ ఎఫెక్ట్ స్థాయి ఏంటో 2019లో వైసీపీకి దక్కిన భారీ విజయమే చాటి చెప్పింది. లోకేశ్ నుంచి ఇదే తరహా ఇంపాక్ట్ కోసం పార్టీ శ్రేణులు చూస్తాయనడంలో సందేహం లేదు. మరి.. రాబోయే రోజుల్లో టీడీపీ అడుగులు ఎలా ఉంటాయో.. వేచి చూడాల్సిందే..!
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?