Chandrababu: ఓ వైపు కరోనా కల్లోలం కొనసాగుతుంటే మరోవైపు రాజకీయ ఎత్తుగడల్లో భాగంగా మరోవైపు ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడుకు బంపర్ ఆఫర్ ఇచ్చారా? రాజకీయ ఎత్తుగడల్లో భాగంగా ఏపీ సర్కారు తీసుకుంటున్న నిర్ణయాలు విపక్ష నేతకే మేలు చేయనున్నాయా? ఈ ఆసక్తికరమైన చర్చ ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్. కరోనా కల్లోలం నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబుపై మరో కేసు నమోదు అయ్యింది. గుంటూరు జిల్లాలోని అరండల్ పేట పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయ్యింది. ఇటీవలే కరోనాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ కర్నూలు టూ టౌన్ పోలీస్ స్టేషన్లో చంద్రబాబు నాయుడిపై కేసు నమోదు అయిన విషయం తెలిసిందే. దీంతో కొత్త చర్చ జరుగుతోంది.
అసలేం జరిగింది?
కరోనాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ కర్నూలు టూ టౌన్ పోలీస్ స్టేషన్లో చంద్రబాబు నాయుడిపై కేసు నమోదు అయిన విషయం తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి చంద్రబాబుకు కర్నూలు పోలీసులు నోటీసులు కూడా ఇచ్చారు. ఈ కేసు అలా ఉండగానే.. గుంటూరు జిల్లాలో బాబుపై తాజాగా మరో కేసు నమోదు అయ్యింది. కరోనాపై అసత్య ప్రచారం చేస్తూ ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తున్నారంటూ చంద్రబాబుపై న్యాయవాది పచ్చల అనిల్ కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కరోనా పట్ల ప్రజలు భయపడేలా చంద్రబాబు, టీడీపీ నేతలు మాట్లాడారని అనిల్ కుమార్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. అనిల్ ఫిర్యాదును స్వీకరించిన అరండల్ పేట పోలీసులు.. చంద్రబాబు నాయుడిపై కేసు నమోదు చేశారు. 188, 505(1)B, 505(2) సెక్షన్ల కింద బాబుపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.
టీడీపీ వాదన ప్రజల్లోకి పోతోందా?
చంద్రబాబుపై కేసులను టీడీపీ శ్రేణులు తీవ్రంగా తప్పుపడుతున్నాయి. ప్రభుత్వం కావాలనే తప్పుడు కేసులు పెట్టిస్తోందని ఆరోపిస్తున్నారు. ఎన్ని అక్రమ కేసులు పెట్టిన ప్రజల కోసమే చంద్రబాబు పని చేస్తారని అంటున్నారు. అయితే, విశ్లేషకులు సైతం ఇదే వాదన వినిపిస్తున్నారు. కారణాలు ఏవైనా కరోనా సమయంలో జరిగే ఈ తరహా ఘటనలు ప్రతిపక్షాన్ని ప్రభుత్వం టార్గెట్ చేసిందనే భావన ప్రజల్లో ఏర్పడేందుకు మూలంగా ఉంటాయంటున్నారు. మరి ఈ కోణం గురించి అధికార పార్టీ ఆలోచించిందా? ఏమో వైసీపీ నేతలకే తెలియాలి.