Chandrababu: ఏపి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు సోమవారం నుండి జరగనున్న సంగతి తెలిసిందే. గత సమావేశాల్లో జరిగిన అవమానాలకు కలత చెందిన చంద్రబాబు అసెంబ్లీ సమావేశాలను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు. మళ్లీ సీఎంగానే అసెంబ్లీలో అడుగు పెడతానని, అప్పటి వరకూ అసెంబ్లీకి రానంటూ శపథం చేసి బయటకు వచ్చారు చంద్రబాబు. అయితే అత్యంత కీలకమైన బడ్జెట్ సమావేశాలకు చంద్రబాబు మినహా మిగిలిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హజరు కావాలా..? వద్దా అనే దానిపై గత కొంత కాలంగా పార్టీలో చర్చ జరుగుతోంది. పార్టీ పొలిట్ బ్యూరోలో ఇప్పటికే మెజార్టీ నేతలు చట్టసభలకు వెళ్లరాదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
Chandrababu: ఆన్ లైన్ ద్వారా టీడీఎల్పీ భేటీ
అయితే సోమవారం నుండి జరిగే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో హజరుపై తుది నిర్ణయం తీసుకునేందుకు ఈ రోజు చంద్రబాబు అధ్యక్షతన టీడీఎల్పీ ఈ మధ్యాహ్నం సమావేశం కానుంది. ఆన్ లైన్ ద్వారా జరిగే ఈ టీడీఎల్పీ భేటీలో తుది నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఒక వేళ సభకు హజరుకాకూడదని నిర్ణయం తీసుకుంటే ప్రత్యామ్నాయ కార్యక్రమాల నిర్వహణపైనా చర్చించి ఒక నిర్ణయం తీసుకుంటారని సమాచారం. ప్రధానమైన ఈ బడ్జెట్ సమావేశంలో మూడు రాజధానుల అంశం, జిల్లాల పునర్విభజన వంటి కీలక అంశాలు ఉండటంతో సమావేశాలను బహిష్కరించడం సమంజసమా కాదా అనే దానిపై చర్చ జరుగుతోంది.
సమావేశాలకు వెళ్లకూడదని నిర్ణయం తీసుకుంటే..
తెలుగుదేశం పార్టీ అసెంబ్లీ సమావేశాలకు వెళ్లకూడదని నిర్ణయం తీసుకుంటే జగన్ బాటలో పయనించినట్లు అవుతుంది. గతంలో పార్టీ మారిన వైసీపీ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయనందుకు నిరసనగా జగన్మోహనరెడ్డి నేతృత్వంలోని వైసీపీ సభ్యులు నిరవదికంగా అసెంబ్లీ సమావేశాలను బాయ్ కాట్ చేశారు. ఆ తరువాత ఆయన జనంలోకి వెళ్లారు. అయితే టీడీపీ ఆవిర్భావం తరువాత అనేక సార్లు ప్రతిపక్షంలో ఉంది. కానీ పూర్తి స్థాయిలో సమావేశాలను బహిష్కరించిన సందర్భాలు ఇంత వరకూ లేవు. ఇప్పుడు గనుక అసెంబ్లీ సమావేశాలకు వెళ్లకూడదని నిర్ణయం తీసుకుంటే టీడీపీ చరిత్రలో ఇది నిలిచిపోతుంది.