తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)లో వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బొబ్డే సతీ సమేతంగా శ్రీవారిని దర్శించుకున్నారు. సీఐజే బొబ్డే వెంట సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఇందు మల్హోత్రా, ఏపి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ దుర్గాప్రసాదరావులు పాల్గొని శ్రీవారిని దర్శించుకున్నారు. టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఈ సందర్భంగా సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ బొబ్డే దంపతులకు స్వామివారి ప్రసాదాలను, జ్ఞాపికను అందజేశారు.
శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు
తిరుమలలో వైకుంఠ ఏకాదశి ద్వార దర్శనాలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. ఉదయం అభిషేకాల అనంతరం ఆలయ అర్చకులు వైకుంఠ ద్వారాలు తెరిచారు. తెల్లవారుజాము నాలుగు గంటల నుండి భక్తుల దర్శనాలు ప్రారంభమయ్యాయి. సాధారణ భక్తులతో పాటు వీఐపీ, వీవీఐపీ లు దర్శనాల కోసం క్యూ కట్టారు. ఏపి నూతన ప్రభుత్వప్రధాన కార్యదర్శి అదిత్యనాద్ దాస్, డిప్యూటి సీఎం నారాయణస్వామి, మంత్రులు బాలినేని శ్రీనివాసరెడ్డి, అవంతి శ్రీనివాస్, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆదిమూలపు సురేష్, ఎంపి వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి, మోపిదెవి వెంకట రమణ, మిథున్ రెడ్డి, గోరంట్ల మాధవ్, జస్టిస్ నారాయణరెడ్డి, మానవేంధ్రనాధ్ రాయ్, తెలంగాణ మంత్రి హరీష్ రావు, మల్లారెడ్డి, శ్రీనివాసగౌడ్, గంగుల కమలాకర్, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి తదితర ప్రముఖులు నేడు శ్రీవారిని దర్శించుకున్నారు.